Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : గల్ఫ్ తీరంలో గురువారం చమురు ట్యాంకర్లపై జరిగిన దాడి ఇరాన్ పనేనని, దీనిని తేలికగా తీసుకోబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (యూఎస్సెంట్కామ్) విడుదల చేసిన ఒక వీడియోను ప్రస్తావిస్తూ 'ఇరాన్ ఆ దాడి చేసింది. మీకు తెలుసా, మీరు పడవను చూపిిన కారణంగానే ఇరాన్ ఆ దాడిచేసింది' అని ట్రంప్ ఒక వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వారు సాక్ష్యాలను ఉంచదలుచుకోలేదని, అందుకే దాడి చేశారని ట్రంప్ అన్నారు. దాడి జరిగిన తర్వాత ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కాప్స్ (ఐఆర్జీసీ) ఒక ట్యాంకరు నుంచి (కొకుకా కరేజియస్) పేలని మందుపాతరను తొలగిస్తున్న దృశ్యాలు యూఎన్సెంట్కామ్ గురువారం రాత్రి విడుదల చేసిన వీడియోలో కనిపిస్తున్నాయి. 'స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.10 నిముషాలకు ఐఆర్జిసి గస్తీ పడవ ఒకటి కొకుకా కరేజియస్ ట్యాంకర్ను చేరుకుని పేలని పదార్ధాలను తొలగించడాన్ని రికార్డు చేశాము' అని యూఎస్సెంట్కామ్ ప్రతినిధి బిల్ అర్బన్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్య ప్రాచ్యంలో కొత్త సంఘర్షణపై అమెరికాకు ఆసక్తి లేదని, మధ్య ప్రాచ్య ప్రాంతంలో అమెరికా, దాని భాగస్వాములు వారి ప్రయోజనాలను రక్షించుకునేందుకు అవసరమైన చర్య తీసుకుంటుందని ఆ ప్రకటన పేర్కొంది. అయితే రెండు ట్యాంకర్లపై దాడికి ఇరాన్దే బాధ్యత అని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో గురువారం ఆరోపించగా, ఇరాన్ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జవాద్ జరీఫ్ గురువారం ట్విట్టర్లో స్పందిస్తూ ఇరాన్కు వ్యతిరేకంగా జరుపుతున్న ఆర్థిక ఉగ్రవాదాన్ని కప్పి పుచ్చుకునేందుకు తన విధ్వంసక దౌత్యాన్ని ఉపయోగించే ఆలోచనతోనే దాడి జరిగిన వెంటనే అమెరికా తమపై వేలెత్తి చూపిందని అన్నారు.
స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి: గుటెరస్
ఒమన్ తీరంలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి జరిగిన ఘటనలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆ సంఘటనలో వాస్తవం తెలుసుకోవడం చాలా ముఖ్యమన్నారు. బాధ్యతలను స్పష్టంగా వివరించడం కూడా చాలా ముఖ్యమేనన్నారు. వాస్తవాలను ధ్రువీకరించే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. అంతర్జాతీయ సమాజం ఏమనుకున్నా ఈ సంఘటనకు మద్దతిస్తామని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. తీర ప్రాంతంలో ఈ ఘర్షణను ప్రపంచ దేశాలు ఉపేక్షించవని గుటెరస్ అన్నారు.