Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ : స్మార్ట్ఫోన్ల వినియోగంతో పుర్రెల్లో కొన్ని ఎముకలు అవసరానికి మించి పెరుగుతున్నాయని ఆస్ట్రేలియాలోని సన్షైన్ కోస్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఊరట కలిగించే విషయం ఏంటంటే దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేకపోవడం. ఒకప్పుడు ఇలాంటి ఎముక పెరుగుదల అరుదుగా.. లక్షల్లో కొందరిలో మాత్రమే గుర్తించేవారు. స్మార్ట్ఫోన్ల వినియోగం కారణంగా ఈ లక్షణాలు అనేక మందిలో గుర్తించవచ్చని ఆ సంస్థ తెలిపింది. పుర్రె వెనుక భాగంలో తాకితే తెలిసేంత సైజుకు ఎముకలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.18 నుంచి 30ఏండ్ల వయసున్న వెయ్యి మంది పుర్రెలను పరిశీలించిన తర్వాత తాము ఈ అంచనాకు వచ్చామని డాక్టర్ డేవిడ్ షహర్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వైద్య వృత్తిలో 20 ఏండ్లుగా ఉన్న తాను గత పదేండ్ల నుంచి ఎముక పెరుగుదలకు సంబంధించిన కేసులను ఎక్కువగా చూస్తున్నట్టు డేవిడ్ తెలిపారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లను వాడేటప్పుడు మనం మెడను వంచి కిందకు చూస్తూ ఉండటం సమస్యకు మూలకారణమని అన్నారు. తాజా అధ్యయనం ప్రకారం కొంతమంది యువకుల ఎముకలు ఒక అంగుళం మేర పెరిగినట్టు తెలిసింది. 1996 నాటితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గతేడాది నీల్సన్ సంస్థ జరిపిన ఒక సర్వే ప్రకారం భారత్లో మొబైల్ఫోన్ సగటు వినియోగం రోజుకు 90 నిమిషాలు. బాగా ఖరీదైన ఫోన్లు వాడే వారైతే 2 గంటల 10 నిమిషాలు వాడుతున్నారు. బ్రిటన్లో ఇది రెట్టింపు కంటే ఎక్కువ. కచ్చితంగా చెప్పాలంటే రోజుకు మూడున్నర గంటల పాటు యువత స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్నారని సన్షైన్ కోస్ట్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.