Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాంగ్కాంగ్: హాంగ్కాంగ్ నగరంలో మరోసారి నిరసనలు మిన్నంటాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న పౌరులను పారదర్శకమైన విచారణ నిమిత్తం చైనాకు అప్పగించాలని ఇక్కడి ప్రభుత్వం యోచిస్తున్నది. అంతేగాకుండా, ఈమేరకు ఓ బిల్లును రూపొందించి దీనికి మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ బిల్లు చట్టంగా మారినట్టయితే తమ హక్కులకు విఘాతం కల్గిగే ప్రమాదముందని దేశ ప్రజలు ఉద్యమించారు. ఈబిల్లును వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో గతవారం రోజులగా నిరసనలు చేపట్టారు. అయితే, ప్రజా ఆందోళన కార్యక్రమాలు హింసాత్మకంగా మారడంతో ఈ బిల్లు ప్రతిపాదనను వాయిదా వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఆదివారం రోజు నిరసనలు మరోసారి ఉధృతమయ్యాయి. వేలాది మంది ప్రజలు నల్లదుస్తులు ధరించి వీధుల్లోకి చేరుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ బిల్లును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అంతేగాకుండా హాంగ్కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు పట్టణంలోని విక్టోరియా స్క్వేర్ వద్ద గుమిగూడారు. తెల్లటి పూలను చేత్తోపట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎక్స్ట్రాడీషన్ బిల్లును కేవలం కొంతకాలం జాప్యం చేసేందుకే సస్పెండ్ చేశారని వీరు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఆందోళనకారులపై పోలీసులు దాడి చేసినందుకు సీఈ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.