Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సౌదీ యువరాజు ఆరోపణ
రియాద్ : గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని చమురు ట్యాంకర్లపై దాడి ఇరాన్ పనేనని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆరోపించారు. ఇలాంటి దాడులను ఇరాన్ పునరావృతం చేసినట్టయితే ఉపేక్షించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. కాగా, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన అనంతరం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇరాన్పై అమెరికా భారీ ఆంక్షలు మోపింది.
ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దని మిత్రదేశాలను నియంత్రిస్తున్నది. అంతేగాకుండా, ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయాలనే దురుద్దేశంతో ఇతర దేశాలను కూడా ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దని హెచ్చరిస్తున్నది. చమురు సరఫరా కోసం ఇరాన్పై ఆధారపడినట్టయితే ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నది. ఈనేపథ్యంలో పలు దేశాలు ఇరాన్ నుంచి చమురు దిగుమతిని రద్దు చేసుకున్నాయి. మరికొన్ని దేశాలు కొంతకాలం ఇరాన్ నుంచే చమురు దిగుమతిని కొనసాగించేందుకు వెసులుబాటు కల్పించాలని అమెరికాను కోరాయి. అమెరికా మిత్రదేశమైన సౌదీ, ఇరాన్ మధ్య వైర్యం మరింత పెరిగింది. గత గురువారం గల్ఫ్ ఆఫ్ ఒమన్లో రెండు చమురు ట్యాంకర్లపై దాడి జరిగింది.
ఈ దాడి ఇరాన్ పనేనని అమెరికా, సౌదీ ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా నిఘా వర్గాలు ఓ వీడియోను కూడా విడుదల చేశాయి. ఈ వీడియో ఫుటేజ్ అస్పష్టంగా ఉన్నది.
ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధంలేదని ఇరాన్ ప్రకటించినప్పటికీ అంతర్జాతీయ సమాజంలో ఇరాన్ను ఒంటరి చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఇరాన్తో తాము యుద్ధం కోరుకోవడంలేదంటూ ఓ పక్క బుకాయిస్తూనే మరోపక్క సౌదీ కయ్యానికి కాళు దువ్వుతున్నది. తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని ఇరాన్ ప్రయత్నించినట్టయితే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని సౌదీ యువరాజు మహ్మద్ సల్మాన్ ఆదివారం ఘాటుగా హెచ్చరించారు. ఇరాన్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పునరుద్ధరించేందుకు జపాన్ ప్రధాని షింజో ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. అమెరికా బాటలోనే మిత్రదేశాలన్నీ ఇరాన్ను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.