Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా సైబర్ దాడితో స్తంభించిన పవర్గ్రిడ్
మాస్కో: ప్రపంచంపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న అమెరికా తాజాగా రష్యాపై 'వెనిజులా' తరహా దాడికి పాల్పడింది. ఈ ఏడాది ఆరంభంలో అమెరికా మద్దతుతో వెనిజులా పవర్గ్రిడ్ వ్యవస్థపై జరిగిన తరహాలోనే ఇప్పుడు రష్యా పవర్గ్రిడ్పై సైబర్ దాడికి పాల్పడినట్లు న్యూయార్క్టైమ్స్ తన ప్రత్యేక కథనంలో వెల్లడించింది. 2016 నాటి అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి ప్రతీకారంగా ఇప్పుడు రష్యా పవర్గ్రిడ్ కంప్యూటర్ వ్యవస్థలో అమెరికా ప్రభుత్వం మాలావేర్ (వైరస్)ను చొప్పించిందని రష్యా ప్రభుత్వానికి చెందిన మాజీ, ప్రస్తుత అధికారులను ఉటంకిస్తూ ఈ కథనం వెల్లడించింది. ఈ మాలావేర్ను వెనిజులాపై ప్రయోగాత్మకంగా పరిశీలించిన ట్రంప్ సర్కారు దీనిని తన మాట వినని ఆలీన దేశాలలోని మౌలిక వ్యవస్థలపై ప్రయోగిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. టైమ్స్ పత్రిక తన కథనంలో వెల్లడించిన విషయాలు గతంలో వెనిజులా ప్రభుత్వ అధికారులు చేసిన ఆరోపణలకు దగ్గరగా వుండటం గమనార్హం. తమ అంతర్గత వ్యవహా రాలలో రష్యా, ఇతర దేశాలు జోక్యం చేసుకోవటాన్ని తిప్పికొట్టేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలను తీవ్రతరం చేస్తోందని వైట్హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఇటీవల ఒక మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే.. గతంలో రష్యా అమెరికాకు చెందిన మౌలిక వ్యవస్థల్లోకి మాలావేర్ను ప్రవేశపెట్టి ఆయా వ్యవస్థలను స్థంభింప జేసిందని అమెరికన్ గూఢచారి సంస్థ ఎఫ్బీఐ అనేక ప్రకటనల్లో ఆరోపించినప్పటికీ అందుకు సంబంధించిన ఆధారాలు వెలుగు చూడకపోవటం విశేషం.