Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీ-20 దేశాల మంత్రుల అంగీకారం
టోక్యో: సముద్ర జలాలను కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను స్వచ్ఛంతంగా తగ్గించేందుకు వీలుగా అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఇక్కడ ముగిసిన రెండు రోజుల జి20 దేశాల మంత్రుల స్థాయి సమావేశం నిర్ణయించింది. ప్రకృతి వనరులు, ప్రజల జీవితాలు, పరిశ్రమలు, ముఖ్యంగా మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్న ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను కట్టడి చేసేందుకు తక్షణమే కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం వుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచాన్ని వేధిస్తున్న ఇటువంటి సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే కృషిని తాము కొనసాగిస్తామని ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన జపాన్ పర్యావరణ మంత్రి యొషియాకి హరాడా మీడియాకు చెప్పారు. ఈ మేరకు జి20 దేశాల మధ్య అవగాహన కుదరటం తమ సదస్సు సాధించిన ప్రధాన విజయమని ఆయన వివరించారు. ఈ నెల చివరిలో ఒసాకాలో జరుగనున్న జి20 శిఖరాగ్ర సదస్సుకు సన్నాహక చర్యగా జపాన్ ఈ సదస్సును నిర్వహించింది. ఐరాస పర్యావరణ పరిరక్షణా కార్యక్రమం అంచనాల ప్రకారం ఏటా దాదాపు 30 కోట్ల టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా అందులో 80 లక్షల టన్నులకు పైగా వ్యర్థాలు సముద్రాన్ని కాలుష్య కాసారంగా మారుస్తున్నట్టు తెలుస్తోంది.