Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 మందికి పైగా మృతి
అబుజా: నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని బోర్నో రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం జరిగిన మూడు ఆత్మాహుతి దాడుల్లో కనీసం 30 మందికి పైగా మరణించినట్లు అధికారులు చెప్పారు. ఈ ఏడాది జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ఇంత భారీ సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడటం ఇదే తొలిసారి. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 8 గంటల సమయంలో కొండుగా గ్రామ సమీపంలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని, తాము అక్కడికి చేరుకునే సరికి తమకు పెద్దసంఖ్యలో మృతులు కన్పించారని ఎమర్జెన్సీ సర్వీస్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. వాస్తవానికి మృత్యువాత పడిన వారి సంఖ్య 30కిపైగానే వుంటుందని, అదే విధంగా క్షతగాత్రులసంఖ్య 42కుపైగా వుంటుందని ఆయన వివరించారు. అయితే ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటి వరకూ ఏ మిలిటెంట్ సంస్థా ప్రకటించకపోవటం విశేషం. బోర్నో రాష్ట్రంలో ప్రజలు, సైన్యం లక్ష్యంగా చేసుకుని బోకోహరం ఉగ్రవాద గ్రూప్, ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థలు ఇప్పటి వరకూ పలుమార్లు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.