Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26మంది మృతి, 56మందికి గాయాలు
మొగాదీషు: సొమాలియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ హౌటల్లో ఆత్మహుతి దాడికి పాల్పడటమే కాకుండా, కాల్పులకూ తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 26మంది ప్రాణాలు కోల్పోగా, 56మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన కిస్మాయోలోని మెడినా హౌటల్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మొదట ఓ ఉగ్రవాది.. కారులో భారీ పేలుడు పదార్థాలతో హౌటల్లోకి దూసుకొచ్చి ఆత్మహుతి దాడి చేసుకున్నాడు. దాడి నుంచి తేరుకునేలోపే మరికొంత మంది ఉగ్రవాదులు హౌటల్లోకి చొచ్చుకువచ్చి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 26 మంది మృతి చెందగా.. వారిలో ఇద్దరు జర్నలిస్ట్లులు, హౌటల్ సిబ్బంది, విదేశీయులు, స్థానికులు ఉన్నట్టు సమాచారం. ఉగ్రవాదులు పోలీస్ యూనిఫార్మ్లో వచ్చి కాల్పులకు తెగబడ్డట్టు కొంతమంది సాక్షులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి హౌటల్లోకి చొరబడ్డ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భద్రతాసిబ్బందికి దాదాపు 12 గంటల సమయం పట్టింది. శనివారం ఉదయం వరకు పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. అల్-ఖైదా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే సొమాలియాలో త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దాడికి గురైన హౌటల్లో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు సమావేశమయ్యారు. వారిని లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. కాగా, ఇందులో వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. ఉగ్రవాదులు ఎంతమంది వచ్చారనే దానిపై ఇప్పుడే అంచనాకు రాలేమని తెలిపారు. ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టినట్టు భద్రతాధికారులు వెల్లడించారు.