Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంబ్రిడ్డ్ అనలిటికా కేసులో సెటిల్మెంట్
- 3-2 మెజార్టీతో అంగీకరించిన ఎఫ్టీసీ
- భారీ ఫైన్కు స్పందించని 'నెట్' దిగ్గజం
వాషింగ్టన్: వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రత వైఫల్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్బుక్కు అమెరికాలోని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టీసీ) భారీ జరిమానా విధించింది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ ఫేస్బుక్ నుంచి కోట్లాది మంది యూజర్ల డేటాను సేకరించి దానిని ట్రంప్ అనుకూల ప్రచారానికి వినియోగించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం 'కేంబ్రిడ్జి అనలిటికా' సంస్థ వద్ద వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఎఫ్టీసీ ఏడాది క్రితమే ఫెస్బుక్పై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టింది. ఈ కేసు సెటిల్మెంట్లో భాగంగా ఫేస్బుక్ 5 బిలియన్ డాలర్ల (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 34వేల కోట్లు) అపరాధ రుసుమును చెల్లించేందుకు అంగీకరించింది. ఫెస్బుక్ జరిమానా విధింపు ప్రతిపాదనకు ముగ్గురు రిపబ్లికన్ కమిషనర్లు అనుకూలంగా ఓటు వేయగా.. ఇద్దరు డెమోక్రటిక్ కమిషనర్లు వ్యతిరేకంగా ఓటు వేశారు. వ్యక్తిగత సమాచార భద్రతా వైఫల్యాలకు గానూ ఒక ఐటీ కంపెనీకి ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఇంత భారీ జరిమానా విధించడం ఇదే తొలిసారి. ఫేస్బుక్-ఎఫ్టీసీ మధ్య కుదిరిన ఈ సెటిల్మెంట్కు అమెరికా న్యాయశాఖ అనుమతి లభించాల్సి ఉంది. పౌర డివిజన్కు చెందిన న్యాయ విభాగం ఈ తీర్మానాన్ని సమీక్షించి తుది తీర్పును వెలువరిస్తుంది. అయితే ఈ విచారణకు ఎంతకాలం పడుతుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమంటున్నారు సంబంధిత వర్గాలు. ఫేస్బుక్పై గతంలోనూ భద్రతా వైఫల్యాల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 2011లో ఈ కంపెనీ ఫెడరల్ ట్రేడ్ కమిషన్తో సెటిల్మెంట్ చేసుకుంది. అయితే ఇటీవల కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదంతో ఈ సోషల్మీడియా సంస్థపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ గతేడాది ఫేస్బుక్పై ఉన్న కేసును మళ్లీ తెరిచింది. ఈ కేసు సెటిల్మెంట్లో భాగంగానే భారీ జరిమానా విధించింది. జరిమానాతో పాటు కొన్ని ఆంక్షలు కూడా విధించినట్లు తెలుస్తోంది.
లైట్ తీసుకున్న ఫేస్బుక్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కేంబ్రిడ్జి అనలిటికా సంస్థకు డేటా విక్రయించి భారీగా సొమ్ములు ఆర్జించిన ఫేస్బుక్ సంస్థ ఎఫ్టీసీ విధించిన ఫైన్ను చాలా లైట్ తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎఫ్టీసీ దాదాపు రూ. 34వేల కోట్లు మేర జరిమానా విధించినప్పటికీ కంపెనీ పెద్దగా స్పందించలేదు. డేటా భద్రత వైఫల్యం కేసులో న్యాయపరమైన రాజీ కోసం 3 నుంచి 5 బిలియన్ డాలర్లు కట్టాల్సి వస్తుందని ఈ ఏడాది ఆరంభంలో కంపెనీ అంచనా వేసింది. దానికి తగ్గట్టుగానే కేటాయింపులు కూడా జరిపింది. దీంతో తాజా పరిణామం కంపెనీ యాజమాన్యాన్ని గానీ.. స్టాక్ను గానీ ప్రభావితం చేయ లేకపోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఫేస్బుక్ స్టాక్ విలువ 1.8శాతం పెరగడం విశేషం.