Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మండ్ : నేపాల్లో భారీ వర్షాలు పోటెత్తాయి. గత కొద్ది రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లపైకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. వరదల్లో చిక్కుకొని మృతిచెందినవారి సంఖ్య ఆదివారం నాటికి 50కి చేరుకుందని అధికారులు ధ్రువీకరించారు. 30 మంది గల్లంతయ్యారు. వరదల్లో చిక్కుకొని గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అన్నారు. నేపాల్లోని 30 జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాల్లో నేపాల్ ఆర్మీ సహాయక చర్యలు చేపడుతున్నదని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు.