Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్ చమురు నౌక విడుదలపై బ్రిటన్ మెలిక
లండన్: సిరియాకు చమురు సరఫరా చేయబోమని ఇరాన్ హామీ ఇచ్చినట్టయితే తమ ఆధీనంలో ఉన్న నౌకను విడుదల చేస్తామంటూ బ్రిటన్ మెలిక పెట్టింది. ఈ విషయాన్ని బ్రిటన్ విదేశాంగ మంత్రి జెరేమి హంట్ వెల్లడించారు. కాగా, బ్రిటన్కు చెందిన రాయల్ నేవీ సిబ్బంది.. ఇరాన్కు చెందిన ఆయిల్ ట్యాంకర్ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా బ్రిటన్కు చెందిన ఓ ఆయిల్ ట్యాంకర్ను ఇరాన్ నిర్బంధించడానికి ప్రయత్నించింది. దీంతో గల్ఫ్ సమీపంలోని హెర్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై బ్రిటన్ స్పందించింది. జెరెమీ హంట్ మీడియాతో మాట్లాడారు. ' చమురును సిరియాకు సరఫరా చేయబోమని యూకేకి ఇరాన్ హామీ ఇచ్చినట్టయితే మా రాయల్ మెరైన్స్ జిబ్రాల్టర్ వద్ద స్వాధీనం చేసుకున్న ఇరాన్ ట్యాంకర్ను విడుదల చేస్తాం' అని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను ఉల్లంఘిస్తుందన్న అనుమానాలతో ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ను ఈనెల4 బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరాన్తో చర్చించిన హంట్.. ఉద్రిక్త పరిస్థితులు చెలరేగేలా చర్యలు ఉండకూడదని సూచించారు. 'మా ఆందోళన చమురు ఉత్పత్తులపై కాదు.. మీ ఉద్దేశాలపై మాత్రమే ఉంది. మాకు కచ్చితమైన హామీ ఇచ్చినట్టయితే ఆ ఆయిల్ ట్యాంకర్ను విడిచేస్తాం' అని ఇరాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ జావద్ జరీఫ్కు హంట్ తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించాలని జావద్ అనుకుంటున్నారని ఆయన చెప్పారు. అయితే, ఇరాన్ మాత్రం తమ అభిప్రాయాలను మార్చుకోబోమని స్పష్టం చేస్తోంది. తమపై ఎటువంటి ఆంక్షలు విధించినా ఆయిల్ ఎగుమతులను కొనసాగిస్తామని చెబుతోంది. తాము అణు ఒప్పందాన్ని ఉల్లంఘించి, మోతాదుకి మించి యురేనియం శుద్ధి చేస్తున్నామని ఇటీవల ఇరాన్ ప్రకటించినప్పటికీ నుంచి ఉద్రిక్తతలు మరింత పెరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. అప్పటి నుంచి ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలను రద్దు చేసుకోవాలని మిత్రదేశాలపై అమెరికా ఒత్తిడి పెంచింది. ఇరాన్తో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్న దేశాలపై భారీ ఆంక్షలు మోపింది.