Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేబర్ పార్టీ ఎంపీ నిరసన
లండన్: భారత్లో ముస్లింలపై కొనసాగుతున్న దాడులపై బ్రిటన్ లేబర్ పార్టీకి చెందిన భారత సంతతి ఎంపీ జోనాథన్ అశ్వర్త్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బ్రిటీష్ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి వెంటనే పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన ప్రధాని అభ్యర్థి, ప్రస్తుత విదేశాంగ మంత్రి జెరిమీ హంట్కు ఇటీవల లేఖ రాశారు. ఈ పరిస్థితి పట్ల నిర్లిప్త వైఖరిని అనుసరిస్తున్న భారత ప్రభుత్వానికి బ్రిటన్ ప్రజల తరపున ఆందోళన వ్యక్తం చేయాలని జెరిమిహంట్, ఆయన సహచరులను కోరారు. భారత్లో ముస్లింలపై కొనసాగుతున్న దాడుల పట్ల తన నియోజకవర్గం లీసెస్టర్ సౌత్కు చెందిన అనేక మంది ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన విదేశాంగ మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అత్యంత తీవ్రమైన ఈ సమస్యపై వెంటనే స్పందించాలని ఆయన హంట్ను కోరారు. భారత్లో పరిస్థితి నానాటికీ ఆందోళనకరంగా మారుతోందని, ముస్లింలపై ఉద్దేశపూర్వక హత్యలు, దాడులు, వివక్ష, గూండాయిజం వంటివి కొనసాగుతున్నాయనీ, ప్రజలు తమ మత విశ్వాసాలను ఆచరించేందుకు కూడా ఆంక్షలను ఎదుర్కొంటున్నారని అశ్వర్థ్ తన లేఖలో వివరించారు. ఈ లేఖపై స్పందించిన విదేశాంగశాఖ తాము ఈ విషయంపై భారత ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామనీ, మానవ హక్కుల పరిరక్షణ విషయంలో భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని వివరించింది.