Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాస సర్వేలో వెల్లడి
న్యూయార్క్ : గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 2కోట్ల మంది చిన్నారులు టీకాలు వేయించుకోలేదని ఐరాస వెల్లడించింది. ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను సంరక్షించాలంటే టీకాలు వేయించడం తప్పనిసరి అని అభిప్రాయపడింది. చిన్నారుల టీకాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యుహెచ్వో), యూనిసెఫ్ సంస్థలు సమగ్ర సర్వే చేపట్టాయని ఐరాస పేర్కొంది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. దీనిలోని వివరాల ప్రకారం....గతేడాది ప్రపంచ వ్యాప్తంగా 2కోట్ల మంది చిన్నారులు టీకాలు వేయించుకోలేదు. 2016లో కోటీ87 లక్షల మంది టీకాలు వేయించుకోలేదు. టీకాలకు సంబంధించి పలు దేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో టీకాల నుంచి దూరమవుతున్న చిన్నారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. అంతర్యుద్ధాలు నెలకొన్న దేశాల్లోని చిన్నారులు పూర్తిగా టీకాల నుంచి దూరమవుతున్నారని డబ్ల్యుహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమ్ అభిప్రాయపడ్డారు. కోరింత దగ్గు, ధనుర్వాతం, తట్టు వ్యాధుల కారణంగా చిన్నారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతేడాది తట్టు వ్యాధికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా 3.5లక్షల కేసులు నమోదయ్యాయని యూనిసెఫ్ చీఫ్ హెన్రియెట్టా ఫోర్ట్ తెలిపారు. తట్టు వ్యాధి సోకకుండా చిన్నారులకు టీకాలు వేయించొద్దని అమెరికా, యూరప్ దేశాలు నిర్ణయించుకోవడాన్ని ఫోర్డ్ తప్పుపట్టారు. బ్రెజిల్లోనూ చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించడంలేదని అన్నారు. టీకాలప్రజారోగ్యంపై అన్ని దేశాల ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని ఐరాస పిలుపునిచ్చింది.