Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాసియాలో ఆహార భద్రత అధ్వానం
- 2017-18కి గానూ యూఎన్ నివేదికలో వెల్లడి
- ప్రపంచవ్యాప్తంగా అర్ధాకలితో అలమటిస్తున్నవారు 82 కోట్ల మంది
- భారత్లో నిరుద్యోగం.. పాక్లో ఆర్థిక పరిస్థితులు : యూఎన్
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఓవైపు కుబేరుల సంఖ్య పెరిగిపోతున్నట్టుగానే అర్థాకలితో అలమటించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఆయా దేశాల్లో ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంకా 82 కోట్ల మంది (మొత్తం జనాభాలో 11 శాతం మంది) అర్ధాకలితోనే బతుకులీడుస్తున్నారు. ఇక ఆసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని యునైటెడ్ నేషన్స్ ఓ నివేదికలో వెల్లడించింది. 2017-18కి సంబంధించిన ఈ నివేదికను 'స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రీషన్-2019' పేరుతో యూఎన్ సోమవారం విడుదల చేసింది.
నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల మంది తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఇందులో ఆసియా నుంచి 51 కోట్ల మంది ఉంటే నిత్యం ఆర్థిక అసమానతలు, అంతర్గత ఘర్షణలతో అట్టుడుకుతున్న ఆఫ్రికాలో దాదాపు 21.6 కోట్ల మంది ఉన్నారు. 2015 నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండటం గమనార్హం. అయితే 2017-18లో దక్షిణాసియాలో ఆహార భద్రత మరీ అధ్వానంగా ఉంది. 2017లో సుమారు 20.4 కోట్ల మంది ఆకలితో అలమటిస్తుంటే గతేడాదికి వారి సంఖ్య 27.1 కోట్లకు చేరుకుంది.
ఇక భారత్లో ఏటేటా పెరుగుతున్న నిరుద్యోగం, పాకిస్థాన్లో దినదినమూ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇక్కడ ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నదని యూఎన్ పేర్కొంది. భారత్లో ఈ ఏడాది మొదట్లో విడుదలైన ఓ నివేదిక ప్రకారం.. మునుపెన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగిత రేటు నలభై ఐదేండ్ల గరిష్ట స్థాయి (6.1 శాతం)కి పడిపోయింది. కేంద్ర సర్కారు ఆర్థిక అనాలోచిత నిర్ణయాల కారణంగా కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వేల కుటుంబాలు, సంస్థలు రోడ్డున పడుతున్నాయి. పాక్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, హెచ్చుమీరుతున్న ఉగ్రవాదం కారణంగా అక్కడ జనాలకు తినడానికి తిండి కరువైంది.
దీనిపై వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రతినిధి డేవిడ్ బేస్లీ స్పందిస్తూ.. 'గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. దీంతో 2030 నాటికి ఆకలితో అలమటించేవారు లేని ప్రపంచం కావాలనే లక్ష్యాన్ని మేం చేరుకోలేం. ఆరోగ్య భద్రత లేకుండా శాంతి, సుస్థిరతను మనం సాధించలేం.
ఈ సమస్యను అరికట్టేందుకు ఆయా దేశాల పాలకులు నడుం కట్టాలి. ప్రజలకు అత్యవసరమైన ఆహారం, విద్యమీద ప్రత్యేక దృష్టి సారించాలి' అని ఆయన తెలిపారు. దీనికోసం రాజకీయ నిబద్ధత, ఈ రంగాల్లో సరైన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.