Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్: ముంబయిలో వరుస పేలుళ్ల సూత్రధారి, జమాత్-ఉద్-దవా( జేయూడీ) చీఫ్ హఫీజ్ ముహమ్మద్ సయీద్ అరెస్టయ్యాడు. ఓ కేసు విచారణ నిమిత్తం లాహౌర్ నుంచి గుజ్రాన్వాలా వెళ్తున్న సయీద్ను కమోకే టోల్ప్లాజా వద్ద కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆయన్ని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్టు జేయూడీ అధికార ప్రతినిధి నదీవ్ అవాన్ తెలిపారు. ఉగ్రసంస్థల నిర్వాహణ కోసం సయీద్ విరాళాలు సేకరించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హఫీజ్ అక్రమ నిర్బంధాన్ని హైకోర్టులో సవాల్ చేస్తామని అవాన్ చెప్పారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు హఫీజ్ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు పాక్ మీడియా పేర్కొంది. ఉగ్రమూకలకు ఆర్థిక సాయం అందించే విషయమై ఇటీవల పాక్పై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఆ దేశం దిగిరాక తప్పలేదు. ఇందులో భాగంగానే సయీద్తో పాటు అతడి అనుచరులపై 23 కేసులు నమోదు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఐదు ట్రస్టుల ద్వారా నిధులు సేకరించినట్టు ఆరోపణలు రావడంతో వీరిపై కేసులు నమోదు చేశారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థే జమాత్ ఉద్ దవా. 2008,నవంబర్లో ముంబయిలో ఉగ్రవాదులు మారణహౌమం సృష్టించారు. ఈ దాడిలో 166 మంది మృతి చెందారు. ఈ దాడికి హఫీస్ జయీద్ సూత్రధారి. దీంతో, ఐక్యరాజ్యసమితి అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి ఉగ్రవాదసంస్థను కూడా నిషేధిత సంస్థల జాబితాలో చేర్చింది. సయీద్పై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.