Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వలసవిధానాన్ని మార్చే యోచనలో ట్రంప్ సర్కార్
వాషింగ్టన్: ప్రతిభావంతులకే ఇకపై గ్రీన్కార్డులు అందజేయాలనే యోచనలో ట్రంప్ సర్కార్ ఉన్నది. గ్రీన్కార్డుల జారీలో ఉద్యోగుల ప్రతిభ ఆధారంగా ప్రస్తుతం ఉన్న 12శాతం కోటాను 57శాతానికి పెంచే విధంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. ప్రతిభావంతులకు జారీ చేసే గ్రీన్కార్డుల కోటా పెరిగినట్టయితే భారత ఐటీ నిపుణులకు మేలు చేకూరనుంది. కోటా పెంపు విషయాన్ని ట్రంప్ అల్లుడు, సీనియర్ సలహాదారు జారెద్ కుష్నెర్ శ్వేతసౌధంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో తెలిపారు. ట్రంప్ ఆదేశాలతో వలస సంస్కరణలకు ప్రాజెక్టుకు కుష్నెర్ హెడ్గా ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చివరి దశలో ఉండగా.. త్వరలోనే యూఎస్ కాంగ్రెస్ ముందుకు తీసుకొచ్చేందుకు ట్రంప్ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. దీంతో ప్రతిభ ఉన్నవారు గ్రీన్కార్డులు పొందే అవకాశం ఉంటుందని, అంతేగాక.. వచ్చే 10ఏండ్లలో అమెరికా పన్ను ఆదాయం కూడా 500 బిలియన్ డాలర్లు పెరుగుతుందని కుష్నెర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 'ప్రస్తుతమున్న వలస విధానం చాలా పాతది. ప్రతిభ ఆధారిత కోటా ద్వారా కేవలం 12శాతం మందికి మాత్రమే గ్రీన్కార్డులు జారీ చేస్తున్నాం. కానీ చాలా దేశాల్లో ఈ కోటా చాలా ఎక్కువగా ఉంది. కెనడాలో 53శాతం, న్యూజిలాండ్లో 59శాతం, ఆస్ట్రేలియాలో 63శాతం, జపాన్లో 52శాతం ఇస్తున్నారు. అందుకే అమెరికాలో దీన్ని 57శాతానికి పెంచాలని ట్రంప్ ప్రతిపాదించారు' అని కుష్నెర్ అన్నారు. ప్రతిభ ఆధారిత కోటా పెంపు గురించి ఇటీవల ట్రంప్ కూడా స్పందించారు. ఈ కోటాను 57శాతానికి పెంచుతామని, అవసరమైతే మరింత పెంచే అవకాశాలున్నాయని అన్నారు. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం పెరుగుతుందన్నారు. దాదాపు 54ఏండ్ల కిందట అమెరికా వలస విధానంలో సంస్కరణలు చేపట్టారు. ఆ తర్వాత ఈ విధానంలో మార్పులు చేయడం మళ్లీ ఇప్పుడే. ప్రస్తుతమున్న విధానం వల్ల నైపుణ్యవంతులైన యువతకు అవకాశాలు దక్కట్లేదని, అందుకే ఈ ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదించామని ట్రంప్ చెప్పారు. కాగా, హెచ్-1బీ వీసాతో అమెరికాకు వెళ్లి గ్రీన్కార్డుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారత నిపుణులకు తాజా నిర్ణయం మేలు చేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు.