Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 మంది మృతి, 29 మందికి తీవ్ర గాయాలు
- జపాన్లోని క్యోటో నగరంలో ఘటన
టోక్యో: జపాన్లో దారుణం చోటు చేసుకుంది. క్యోటో నగరం లోని ప్రఖ్యాత యానిమేషన్ ప్రొడక్షన్ స్టూడియోకు గుర్తు తెలియని దుండగుడు నిప్పం టించి పరారయ్యాడు. మండే స్వభావం ఉన్న ద్రావణాన్ని భవనం మీదకు చల్లడంతో మూడు అంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అగ్నిమాపక అధికారి మికిహిదీ దైకోకు తెలిపిన వివరాల ప్రకారం... క్యోటో నగరంలోని యానిమేషన్ ప్రొడక్షన్ స్టూడియోలో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులోనే మృతుల సంఖ్య ఎక్కువగా నమోదైంది. కొందరు ఊపిరి ఆడకపోవడంతో మృతిచెందగా, మరికొందరు మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు. అయితే, దుండగుడు ఇంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడో మాత్రం తెలియరాలేదు. అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలికి చేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 20 మంది ఉద్యోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. భవనం నుంచి వస్తున్న మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా అదుపు చేశారు. జపాన్లోని క్యోటో సిటీలో క్యోటో యానిమేషన్ స్టూడియో ఉంది. ఎన్నో ఏండ్లుగా ఈ కంపెనీ నడుస్తుంది. మొదటి సినిమాలు, టీవీ షోలు చేసే ఈ కంపెనీ.. కొన్నేండ్లుగా యానిమేషన్ రంగంలోకి అడుగుపెట్టింది. జపాన్ సంస్కృతి, సంప్రదాయాలపై సినిమాలు, యానిమేషన్ షోలు చేస్తుంది. 100 మంది ఉద్యోగులు ఈ కంపెనీలో పని చేస్తున్నారు. క్కోటో సిటీ మధ్యలోనే పెద్ద బిల్డింగ్ లో ఈ కంపెనీ స్టూడియోలు ఉన్నాయి. అగ్ని కీలలు క్యోటో యానిమేషన్ బిల్డింగ్ నుంచి ఎగిసిపడటం సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఈ ఘటనపై జపాన్ ప్రధాని షింజో అబే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.