Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాన్జ్వాన్ : ప్యూర్టోకిరాలో నిరసనలు వెల్లువెత్తాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్ రికార్డోరోసెల్లో తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వీధుల్లోకి చేరుకొని నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీలు ఝళిపించారు. బాష్పవాయుగోళాలు ప్రయోగిం చారు. పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈఘటనలో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. కాగా, రికార్డో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేగాకుండా, ఇటీవల సెంటర్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ( సీఐజే ) సంస్థ రికార్డోకు సంబంధించిన సెల్ఫోన్ సంక్షిప్త సందేశాలను ప్రచురించింది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదికలోని వివరాల ప్రకారం...రికార్డోకు మహిళల పట్ల చులకన, అగౌరవ భావాలు ఉన్నాయని తెలుస్తోంది. మహిళా రాజకీయ నేతలను, వికలాంగులను, జర్నలిస్టులను, వరద బాధితులను కించపరిచేలా అతని మిత్రులకు పంపిన సంక్షిప్త సందేశాలను సీఐజే సేకరించి ప్రచురించింది. రికార్డో చర్యలను వ్యతిరేకిస్తూ ప్రజలు వీధుల్లోకి చేరుకున్నారు. ఆయన పాలనలో ఆర్థికాభివృద్ధి క్షీణించిందని విమర్శించారు. ఇలాంటి గవర్నర్ తమకొద్దంటూ నిరసనలు చేపట్టారు. గవర్నర్ పదవికి రికార్డో రాజీనామా చేసేంత వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆందోళనకారులు వెల్లడించారు.