Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుర్దు శిబిరాలపై బాంబులు జారవిడిచిన టర్కీ
అంకారా : ఇరాక్కు చెందిన కుర్దు తిరుగుబాటుదారుల దాడిలో టర్కీ దౌత్యవేత్త మృతిచెందారు. ఈదాడికి ప్రతీకారంగా ఇరాక్లోని కుర్దు శిబిరాలపై టర్కీ బాంబులు జారవిడిచింది. ఈ విషయాన్ని టర్కీ రక్షణ శాఖ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. ఖాండిల్లోని కుర్దు తిరుగు బాటుదారుల శిబిరాన్ని అంకారా సైన్యం నేలమట్టం చేసిందని తెలిపింది. కాగా, కుర్దుతిరుగుబాటుదారులకు, టర్కీ బలగాలకు మధ్య 1984 నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉన్నది. కుర్దు తిరుగుబాటుదారులపై టర్కీ ఉగ్రవాద ముద్రవేసింది. ఈ తిరుగుబాటు సంస్థను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని ఐరాసను అభ్యర్థించింది. అయితే, టర్కీ ప్రతిపాదనకు ఐరాస మెజారిటీ సభ్యదేశాలు అంగీకరించకపోవడంతో టర్కీ తిరుగుబాటుదారులపై అంతర్జాతీయ ఉగ్రవాదుల ముద్రపడలేదు. కాగా, బుధవారం ఎర్బిల్ నగరంలో టర్కీ వైస్ కాన్సులేట్ అధికారితో పాటు మరో ఇద్దరు అధికారులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నట్టు కుర్దు తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. కుర్దు నేత దియార్ గరీబ్ మొహ్మద్ను టర్కీ బలగాలు మట్టుబెట్టినందుకు తామీ హత్యకు పాల్పడినట్టు ప్రకటించుకున్నారు.