Authorization
Mon Jan 19, 2015 06:51 pm
8 మంది మృతి, 33 మందికి గాయాలు
కాబూల్ : అఫ్టాన్లోని కాబూల్ యూనివర్సిటీ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. అఫ్ఘాన్ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి వహీదుల్లా మయర్ తెలిపిన వివరాల ప్రకారం....కాబూల్ వర్సిటీ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. రెండు మోటారు సైకిళ్లు కూడా దగ్ధమయ్యాయి. రిమోట్ సాయంతో పేలుడుకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు ఉగ్రవాదంతో సంబంధాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీస్ అధికార ప్రతినిధి ఫిర్దోజ్ ఫరామర్జ్ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. కాగా, హింసాత్మక ఘటనల నిర్మూలన కోసం అఫ్ఘాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఓ మెట్టుదిగి తాలిబన్లతో చర్చలకు సిద్ధమైంది. ఖతార్లోని దోహా నగరంలో ఈనెల7,8 తేదీల్లో తాలిబన్ నేతలకు, ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. పౌర నివాసాలపై, ఆస్పత్రులపై, పాఠశాలలపై ఇకపై దాడులకు పాల్పడేది లేదని తాలిబన్ నేతలు భరోసా ఇచ్చారు. ప్రజాభద్రత కోసం పాటుపడతామని అన్నారు. భద్రతా బలగాలపై దాడులకు పాల్పడే అంశంపై తాలిబన్లు ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయితే, ఈచర్చలు ఫలప్రదమైన ఫలితాలను ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనెల జులై8న అఫ్ఘాన్ ఇంటెలిజెన్స్ కార్యాలయం సమీపంలో తాలిబన్లు కారు బాంబు పేల్చారు. ఈ ఘటనలో 8 మంది భద్రతా సిబ్బంది మృతిచెందారు. జులై9న బాగ్లాన్ ప్రావిన్స్లోని ఓ ఇంటిపై దాడికి పాల్పడి 8 మందిని హతమార్చారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు.