Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా డ్రోన్లన్నీ సురక్షితం : ఇరాన్
వాషింగ్టన్: హౌర్ముజ్ జలసంధిలో ఇరాన్ డ్రోన్ను తమ యుద్ధనౌక కూల్చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ట్రంప్ ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ దేశానికి సంబంధించిన అన్ని డ్రోన్లు సురక్షితంగానే ఉన్నాయని ప్రకటించింది. డ్రోన్ కూల్చివేత తమ దృష్టికి రాలేదని తెలిపింది. అమెరికా-ఇరాన్ల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికా నావికాదళానికి చెందిన యూఎస్ఎస్ బాక్సర్ నౌక హౌర్ముజ్ జలసంధి సమీపంలోని అంతర్జాతీయ జలాల మీదుగా ప్రయాణిస్తుండగా ఇరాన్కు చెందిన ఓ డ్రోన్ నౌకకు అతి సమీపంగా వచ్చినట్టు ట్రంప్ తెలిపారు. నౌకకు దాదాపు 1000 గజాల దూరంలో డ్రోన్ సంచరించిందని, హెచ్చరించినా అక్కడి నుంచి వెనక్కి వెళ్లకపోవడంతో తమ మిలిటరీ అధికారులు దాన్ని కూల్చేసినట్టు తెలిపారు. నౌక, అందులోని సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకునే కూల్చినట్టు వెల్లడించారు. అయితే ఈ వార్తలను ఇరాన్ ఖండించింది. 'డ్రోన్ను కోల్పోయినట్టు ఈ రోజు మాకు ఎలాంటి సమాచారం అందలేదు' అని ఆ దేశ విదేశాంగమంత్రి మహ్మద్ జావెద్ జరీఫ్ తెలిపారు.
కాగా, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరాన్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయాలనే దురుద్దేశంతో ఇరాన్పై అమెరికా భారీ ఆంక్షలు మోపింది. మిత్రదేశాలను కూడా ఇరాన్ అణు ఒప్పందం నుంచి బయటకు రావాలని ఒత్తిడి పెంచింది. ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించే దేశాలపై భారీ ఆంక్షలు మోపుతామని హెచ్చరించింది. ఫలితంగా అనేక దేశాలు ఇప్పటికే ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలను తెగతెంపులు చేసుకున్నాయి. మరికొన్ని దేశాలు ద్వైపాక్షిక సంబంధాలు రద్దు చేసుకునేందుకు మరికొంత సమయం కావాలని అమెరికాను కోరాయి. ఇరాన్పై అమెరికా ఆంక్షలు మోపినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత నెలలో గల్ఫ్ ఆఫ్ ఒమన్ సమీపంలో రెండు చమురు నౌకలపై దాడి జరిగింది. ఈ దాడి ఇరాన్ చేసిందని అమెరికా ఆరోపించింది. ఈమేరకు తమ వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయని పేర్కొంది. తామే చమురు నౌకలపై దాడికి పాల్పడినట్టు సేకరించిన సాక్ష్యాలను చూపాలని ఇరాన్ డిమాండ్ చేయడంతో అమెరికా వెనక్కి తగ్గింది. అంతర్జాతీయ సమాజంలో ఇరాన్ను ఒంటరి చేయాలని అమెరికా ప్రయత్నిస్తూనే ఉన్నది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే గతనెల 19న అమెరికాకు చెందిన ఓ నిఘా డ్రోన్ను ఇరాన్ కూల్చేసిన విషయం తెలిసిందే. నిబంధనలను ఉల్లంఘించి తమ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిందని, అందుకే కూల్చేసినట్టు ఇరాన్ ప్రకటించింది.
ఇరాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని అమెరికా ప్రయత్నించినట్టయితే ఉపేక్షించబోమని హెచ్చరించింది. తమ డ్రోన్ను ఇరాన్ కూల్చేసిన సంగతి అమెరికా ధ్రువీకరించింది. ఈ ఘటన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ గగనతలం మీదుగా అమెరికా తమ విమానాల రాకపోకలను నిలిపివేసింది. ఇక తాజా ఘటనతో ఇరు దేశాల మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.
''ఇరాన్ తాజాగా చేపట్టిన అణు కార్యక్రమాలను అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది. పరిమితులకు మించి యురేనియం నిల్వ చేయండం, 3.67 శాతం కంటే ఎక్కువ సాంద్రతను మించి యురేనియాన్ని శుద్ధి చేయడం వంటి వాటిని అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు.''
- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి