Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్ టాంకర్లను అధీనంలోకి తీసుకున్న ఇరాన్
టెహ్రాన్ : బ్రిటన్కు చెందిన రెండు చమురు టాంకర్లను ఇరాన్ శుక్రవారం తన అధీనంలోకి తీసుకోవడంతో గల్ఫ్లో ఉద్రిక్తతలుతతలెత్తాయి. ఇందులో ఒకటి బ్రిటన్కు చెందినది కాగా రెండోది లైబీరియాకు చెందింది. బ్రిటన్ జెండాతో ఉన్న స్టెనా ఇంపెరొ నౌకను అందులోని 23 మంది సాంకేతిక సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్టు ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ శుక్రవారం తెలిపింది. ఇందులో 16 మంది భారతీయులు ఉన్నట్టు సమాచారం. తీర ప్రాంత నిబంధనలు ఉల్లంఘించినందునే వాటిని అధీనంలోకి తీసుకున్నట్టు ఇరాన్ తెలిపింది.
రివల్యూషనరీ గార్డ్స్ స్వాధీనం చేసుకున్న నౌకను సాంకేతిక సిబ్బందిని బందర్ అబ్బాస్ పోర్టుకు తరలించినట్టు ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ తెలిపింది. అయితే ఇరాన్కు చెందిన చేపల వేటకు ఉపయోగించే పడవను టాంకర్ ఢ కొన్న కారణంగా దానిని అదుపులోకి తీసుకున్నట్టు ఇరాన్ అధికారిక వార్తా సంస్ధ ఐఆర్ఎన్ఎ వెల్లడించింది.
స్టెనా ఇంపెరో యజమానులు దీనిపై స్పందిస్తూ తమ నౌక హర్మోజ్ జల సంధిని దాటుతుండగా గుర్తు తెలియని చిన్న హెలికాప్టర్లతో పాటు మరో హెలికాప్టర్ వెంటాడింది. అ సమయంలో నౌక అంతర్జాతీయ జలాలలో ఉందన్నారు.
లైబేరియన్ జండతో ఉన్న రెండో టాంకర్ మెస్డార్ను కూడా అధీనంలోకి తీసుకున్నట్టు రివల్యూషనరీ గార్డ్స్ వెల్లడించారు. ఈ నౌక తన ప్రయాణ మార్గం నుంచి అనుకోకుండా పక్కకు మళ్లీ సౌదీ పోర్టు రాస్ తనురావైపు, తరువాత ఇరాన్ తీరంవైపు దిశ మార్చుకుందని సంబంధిత అధికారులు తెలిపారు. కేవలం రెండు గంటలు కూడా గడవక ముందే మెసడార్ తన ట్రాకింగ్ సిగల్ను వెనక్కి మళ్ళించినట్టు చెప్పారు. బ్రిటన్కు చెందిన నార్బల్క్ షిప్పింగ్ సంస్ధ దీనిని నిర్వహిస్తోంది. ఆ నౌకపై సాయుధ గార్డులున్నట్టు తాము గమనించామని తెలిపింది.
ఇరాన్ది ప్రమాదకరం : బ్రిటన్
ఇరాన్ చట్ట విరుద్ధమైన, అస్థిరితకు దారితీసే ప్రమాదకర మార్గాన్ని ఎంచుకుంటున్నదని బ్రిటష్ ప్రభుత్వం హెచ్చరించింది. బ్రిటీషు జెండాతో ఉన్న ఒక చమురు టాంకర్ను ఇరాన్ స్వాధీనం చేసుకున్న తరువాత హర్ముజ్ జలసంధిని ప్రయాణానికి ఉపయోగించొద్దని తమ నౌకలకు సూచించింది. ఇరాన్ అదుపులోకి తీసుకున్న తమ నౌకను విడిచిపెట్టకపోతే తమ స్పందన కఠినంగా ఉంటుందని బ్రిటన్ విదేశాంగ మంత్రి జెరెమి హంట్ శనివారం ఉదయం తెలిపారు. తమ ప్రభుత్వం సైనిక చర్య గురించి ఆలోచించడం లేదని అంతకు ముందు ఆయన అన్నారు. జిబ్రాల్టర్ వద్ద ఇరాన్ యుద్ధ టాంకర్ను బ్రిటన్ నావికాదళం స్వాధీనం చేసుకున్న రెండు వారాల తరువాత శుక్రవారం 23 మంది సిబ్బందితో ఉన్న టాంకర్ను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. గ్రేస్ 1 నౌకను స్వాదీనం చేసుకున్నందుకు ప్రతీకార చర్యగా శుక్రవారం నాటి పరిణామాలు చోటు చేసుకున్నట్టు భావిస్తున్నారు. అమెరికా ఆదేశాల మేరకే ఇది జరిగి ఉంటుందని ఇరాన్ పేర్కొంది. బ్రిటన్ బలగాలు అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నాయని హంట్ ఈ సందర్భంగా తెలిపారు. గ్రేస్ 1 సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని, తమ నౌకల భద్రతకు హామీ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.