Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైట్హౌస్లో నేడు ఇమ్రాన్-ట్రంప్ భేటీ
వాషింగ్టన్: అమెరికా, పాకిస్థాన్ మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించుకోవాలన్నదే తమ లక్ష్యమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రధానిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అమెరికాకు వచ్చారు. సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వైట్హౌస్లో భేటీ కానున్నారు. పాక్ దౌత్య కార్యాలయంలో బసచేస్తున్న ప్రధాని ఇమ్రాన్కాన్ సోమవారం ట్రంప్తో జరిగే భేటీలో తాము ఉగ్రవాదంపై పోరు విషయంలో తీసుకుంటున్న నిర్ణయాత్మక చర్యలను వివరించటంతో పాటు పాక్ భూభాగం నుండి కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఉగ్రవాద గ్రూపులపై తీసుకుంటున్న చర్యలు, తాలిబన్లతో శాంతి చర్చలకు చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్ వివరించనున్నారని పాక్ దౌత్యకార్యాలయ వర్గాలు తెలిపాయి. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఆయనకు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషితో పాటు అమెరికాలోని పాకిస్తానీ అమెరికన్లు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు.
'అమెరికా శాంతి ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నాం'
'ఈ శతాబ్ది ఒప్పందం' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిస్తున్న మధ్యప్రాచ్యం శాంతి ఒప్పందాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ పునరుద్ఘాటించారు. ఫతా పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికా శాంతి ప్రణాళికను తాము వ్యతిరేకిస్తున్నట్టు గతంలోనే చెప్పామని, ఈ వైఖరిలో ఎటువంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేశారు. 'డీల్ ఆఫ్ది సెంచరీ, మనామా వర్క్షాప్' వంటి వాటిని తాము ఆమోదించబోమని ఆయన తేల్చిచెప్పారు. పాలస్తీనా పన్ను రెవెన్యూలను ఇజ్రాయిల్ తొక్కి పట్టటంపై ఆయన స్పందిస్తూ ఈ మొత్తాన్ని పూర్తిగా చెల్లించకుండా వాయిదాలుగా నగదు బదిలీ చేస్తే తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. జెరూసలేం పాత నగరంలో ఇటీవల ఇజ్రాయిల్ ప్రభుత్వం చేపట్టిన తవ్వకాలను ఆయన ఖండించారు.
అమెరికాలో భానుడి భగభగలు
సెంట్రల్ అమెరికా, తూర్పు అమెరికా ప్రాంతాలలో మండుటెండలతో పెరు గుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. వాషింగ్టన్ నగరంలో గరిష్టంగా 106 డిగ్రీల ఫారిన్హీట్ (41 డిగ్రీల సెల్షియస్) నమోదవటంతో ఎండవేడిమిని తట్టుకోలేని నగర వాసులు కూలింగ్ సెంటర్లకు పరుగులు తీసారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించటంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. మిస్సిసీపీ లోయ ప్రాంతం నుండి తూర్పు తీర ప్రాంతం వరకూ మైదాన ప్రాంతాలతో సహా అన్ని రాష్ట్రాలలో వేడిగాలులు వీస్తాయని, క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని జాతీయ వాతావరణశాఖ అధికారి అలెక్స లామర్స్ హెచ్చరించారు.