Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 మంది మృతి,
- 40 మందికి పైగా గాయాలు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నట్టు తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. పోలీసులు తమ కమాండర్ను మట్టుబెట్టినందుకు ప్రతీకారంతోనే తామీ దాడికి పాల్పడినట్టు పేర్కొంది. జిల్లా ఎస్పీ సలీమ్ రియాజ్ తెలిపిన వివరాల ప్రకారం... వాయువ్య పాకిస్థాన్లోని దేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలోని పోలీసు చెక్పోస్ట్కు సమీపంలో మోటార్ సైకిళ్లపై వచ్చిన మిలిటెంట్లు చెక్పోస్ట్ వద్ద పహారా కాస్తున్న ఇద్దరు పోలీసులపై కాల్పులకు పాల్పడి పరారయ్యారు. మృత దేహాలను అంబులెన్స్లో తరలిస్తున్న క్రమంలో ఆత్మాహుతి దాడి జరిగింది. బుర్ఖాలో వచ్చిన ఓ మహిళ డిటోనేటర్ పేల్చడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు పోలీసులు ఉన్నారు. కాగా, టీటీపీ ఉగ్రసంస్థ 2007 నుంచి పాకిస్థాన్లో ఉగ్రకార్యకలాపాలు నిర్వహిస్తున్నది. పోలీసులను, పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నది.