Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న అమెరికా, బ్రిటన్
లండన్ : ఇరాన్పై దాడికి అమెరికా, బ్రిటన్ రంకెలేస్తున్నాయి. శనివారం బ్రిటన్ చమురు నౌకను ఇరాన్ నిర్బంధించడంపై బ్రిటన్ విదేశాంగ మంత్రి జెరిమి హంట్ ఇరాన్కు తన అసంతృప్తిని తెలియజేశారు. నౌక నిర్బంధం, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ ఎంపీలనుద్దేశించి హంట్ ట్వీట్ చేస్తూ, సన్నిహిత మిత్రదేశం అమెరికా ఇరాన్పై యుద్ధాన్ని కోరుకుంటే అందుకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలిచ్చారు. వచ్చే మంగళవారం కన్సర్వే టివ్ పార్టీ నూతన నేత కోసం మాజీ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్తో జెరిమి హంట్ పోటీపడు తున్నారు. బ్రిటిష్ ట్రంప్గా పేరొందిన బోరిస్ జాన్సన్ ఇరాన్కు వ్యతిరేకంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టడంలో ముందున్నారు. వచ్చే వారం బ్రిటన్ కొత్త ప్రధానిగా వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎన్నిక కానున్నారు. ఎవరు వచ్చినా ఇరాన్పై అమెరికా రుద్దే యుద్ధానికి బ్రిటన్ మరింత ఆజ్యం పోసే అవకాశాలే ఎక్కువ. బ్రిటన్ విదేశాంగ మంత్రి హంట్ వ్యాఖ్యలపై లండన్లోని ఇరాన్ రాయబారి హమీద్ హమీద్ బైదీనెజాద్ స్పందిస్తూ మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు బ్రిటన్లో కొన్ని శక్తులు చేస్తున్న యత్నాలకు నౌక నిర్బంధం కారణం కానే కాదని, తమపై దాడి చేయడమే వారి అసలు లక్ష్యమని ట్వీట్ చేశారు. ఒత్తిడి పెంచాలనే ఈ ఎత్తుగడలు ప్రమాదకరమే కాదు, తెలివితక్కువ తనం కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. దేశీయంగా శాసిస్తున్న కొన్ని రాజకీయ శక్తులు మధ్య ప్రాచ్యాన్ని మరు భూమిగా మార్చాలని చూస్తున్నాయని విమర్శించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బెదీనేజాద్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య వివాదానికి ప్రధానంగా ఈ నెల 4 జిబ్రాల్టర్ తీరంలో తమ చమురు నౌకను బ్రిటన్ దళాలు నిర్బంధించటమే కారణమని ఆయన వివరించారు. బ్రిటన్ చర్యను సముద్రపు బందిపోటు తనంగా ఇరాన్ అభివర్ణించగా, ఈయూ ఆంక్షలకు వ్యతిరేకంగా సిరియాకు క్రూడాయిల్ సరఫరా చేస్తున్నందునే తాము ఆ నౌకను అడ్డుకున్నామని బ్రిటన్ చెబుతోంది. శుక్రవారం నాడు హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళం బ్రిటన్కు చెందిన ఒక చమురు రవాణా నౌక తమ దేశానికి చెందిన చేపల పడవను ఢీ కొన్నదంటూ దానిని దిగ్బంధించటంతో ఈ వివాదం ముదిరింది. అమెరికా తన ఆధిపత్య వ్యూహంలో భాగంగా మధ్యప్రాచ్యంలో జోక్యం , బాంబు దాడులకు దిగుతోంది. ఇరాక్, ఆప్ఘనిస్తాన్, సిరియా, యెమెన్, పాలస్తీనాల్లో అమెరికా, దాని మిత్ర పక్షాలైన బ్రిటన్, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్ సాగిస్తున్న దాడులు,యుద్ధాలే ఇందుకు నిదర్శనం. ఈ యుద్ధాలు, దాడులతో లక్షలాది మంది చనిపోయారు. ఆ దేశాలు మరుభూమిగా తయారయ్యాయి. లక్షలాది కుటుంబాలు గూడు చెదిరి చెల్లాచెదురయ్యాయి.