Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: 50ఏండ్ల కిందట అదృశ్యమైన ఫ్రాన్స్ జలాంతర్గామి జాడ తెలిసింది. సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టిన ప్రత్యేక బృందాలు మినెర్వే జలాంతర్గామిని గుర్తించినట్టు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లారెన్స్ పార్లీ సోమవారం వెల్లడించారు. రక్షణ మంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం...1968,జనవరిలో ఫ్రాన్స్ దక్షిణ తీరం నుంచి మినెర్వే జలాంతర్గామి బయల్దేరింది. ఆ సమయంలో సబ్మెరైన్లో 52 మంది నావికులు ఉన్నట్టు సమాచారం. సముద్రం మధ్య భాగంలోకి చేరుకోగానే మినెర్వే జలాంతర్గామికి నేవీ కంట్రోల్ రూమ్తో ఉన్న సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి మినెర్వేకి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఈ జలాంతర్గామి ఆచూకీ కోసం 50 ఏండ్ల నుంచి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. పోర్ట్ ఆఫ్ టౌలాన్ సమీపంలో జలాంతర్గామి జలసమాధి అయినట్టు అధికారులు భావించారు. తాజాగా, మినెర్వే జాడను గుర్తించినట్టు ఫ్రాన్స్ పేర్కొంది. టౌలాన్కు 25కిలోమీటర్ల దూరంలో 2,370మీటర్ల సముద్ర గర్భంలో సబ్మెరైన్ను గుర్తించినట్టు ఓషియన్ డిస్కవరీ సంస్థ వెల్లడించింది. జలాంతర్గామిలో ప్రయాణించిన నావికులంతా మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరికి సంబంధించిన వివరాలను ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించలేదు.