Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్ విమర్శ
టెహ్రాన్ : గల్ఫ్ సముద్ర జలాల్లోకి యూరోపియన్ నౌకలను తరలించాలన్న బ్రిటన్ ప్రతిపాదన కవ్వింపు చర్యేనని, ఇటువంటి చర్యలు పరిస్థితిని మరింత దిగజార్చడానికి తప్ప మరి దేనికీ ఉపయోగపడవని ఇరాన్ అధ్యక్షుడు రౌహాని ధ్వజమెత్తారు. గల్ఫ్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐరోపా చమురు నౌకలు ఈ ప్రాంతం గుండా పయనించేటప్పుడు వాటికి ఎస్కార్ట్గా ఉండడం కోసమే ఈ నౌకల పటాలం తరలింపు అని యూరపు కూటమి ప్రతినిధి చెప్పారు. బ్రిటన్ ప్రతిపాదన ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెంచుతుందని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి రెబీ చెప్పారు. గత నెలలో ఇరాన్ చమురు ట్యాంకర్ను బ్రిటన్ స్వాధీనం చేసుకోవడం, 2015 నాటి అణు ఒప్పందం ఉల్లంఘనగానే తాము భావిస్తున్నామని రెబీ తెలిపారు. ఈ ఒప్పందంపై సంతకం చేసిన మిగిలిన దేశాలు ఆస్ట్రియా రాజధాని వియాన్నాలో సమావేశమై అత్యవసర చర్చలు జరుపుతున్న తరుణంలో ఇరాన్ ఈ ప్రకటన చేసింది. అమెరికా 2018 మేలో అణు ఒప్పందం నుండి వైదొలిగి, ఇరాన్పై తిరిగి ఆంక్షలు విధించినప్పటి నుండి ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనా, ఇరాన్లు ప్రయత్నిస్తున్నాయి. బ్రిటన్ అధికారులు జులైలో ఇరాన్ నౌకను నిర్బంధించినప్పటిి నుండి రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయి. దీనికోసం సిరి యాపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలను ఉల్లంఘించినట్టు ఆ దేశాలు ఆరోపించాయి. ఇరా న్ చమురు టాంకర్ను బ్రిటన్ స్వాధీనం చేసుకున్న కొన్ని రోజుల అనంతరం ఇరాన్ బలగాలు బ్రిటన్ జెండాతో ఉన్న ఒక నౌకను హర్మోజ్ జలసంధి వద్ద స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో వియన్నాలో ఆదివారం జరిగిన సమావేశానికి హాజరైన ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి అబ్బాస్ అర్గచ్చి మాట్లాడుతూ చమురు టాంకర్ వివాదాన్ని అణు ఒప్పందంపై చర్చలతో ముడిపెట్టారు. ఈ అణు ఒప్పందాన్నే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీఓఏ)గా పిలుస్తారు. ఇరాన్ తన చమురును ఎగుమతి చేసే మార్గంలో సభ్య దేశాలు ఎటువంటి అవరోధాలు కలిగించరాదని ఈ సందర్భంగా ఆయన అన్నారు.