Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో
57 మంది మృతి
- 16 మంది తలలు నరికివేత
బ్రసీలియా : బ్రెజిల్లోని ఓ కారాగారంలో ఖైదీలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు దిగిన ఘటనలో 57 మంది మృతిచెందారు. అల్టామిరా ప్రాంతీయ కారాగారంలో ఓ బ్యారక్లోని ఖైదీలు మరో బ్యారక్లో చొరబడ్డారు. ఆ బ్యారక్కు నిప్పుపెట్టడమే కాకుండా మారణాయుధాలతో దాడికి దిగారు. ఈ రెండు గ్యాంగులు భీకరపోరు సాగిస్తుండగా, ఇతర ఖైదీలు జైలు పైభాగంలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. దాడులు జరిగిన సమయంలో ఇద్దరు జైలు అధికారులను ఖైదీలు బందీలుగా మల్చుకున్నారు. దాడులు పూర్తయిన తర్వాత వారిని విడుదల చేశారు. ఒళ్లు జలదరించే అంశం ఏమిటంటే మరణించినవారిలో 16 మంది తలలు మొండెం నుంచి వేరుచేసిన ఓ వర్గం ఖైదీలు, ఆ తలలతో ఫుట్ బాల్ ఆడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో మీడియాలో ప్రసారమైంది. రెండు వర్గాల మధ్య గతకొద్ది రోజుల కిందట చెలరేగిన ఘర్షణ 57 మంది ప్రాణాలను బలిగొందని జైళ్ల శాఖ డీజీపీ జర్బాస్ వాస్కాసెలోస్ తెలిపారు. జైలులో ఖైదీలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, జైలు నిర్వహణ లోపం కారణంగా అల్లర్లు చెలరేగాయని వచ్చిన ఆరోపణలను ఖండించారు. కాగా, బ్రెజిల్లో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. మే నెలలో ఆమజొనాస్ రాష్ట్రంలోని పలు కారాగారాల్లో జరిగిన వరుస ఘర్షణలకు సుమారు 55 మంది ఖైదీలు బలయ్యారు. 2017లో బ్రెజిల్లోని ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపు 120 మంది ఖైదీలు మరణించారు. పెరుగుతున్న నేరాలను జైలు అధికారులు నియంత్రించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.