Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: త్వరలో ఐరోపా కూటమి నుంచి నిష్క్రమించనున్న బ్రిటన్ ఆ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులను రెట్టింపు చేసింది. బ్రెగ్జిట్ నష్టాల కోసం ఈ ఏడాది బడ్జెట్లో అదనంగా మరో 210 కోట్ల యూరోల నిధులను కేటాయిస్తున్నట్టు జాన్సన్ సర్కారు బుధవారం ప్రకటించింది. అక్టోబర్ 31న కూటమి నుంచి నిష్క్రమించే ముందు కీలక విభాగాల సన్నద్ధత కోసం 110 కోట్ల పౌండ్లను ఆర్థిక మంత్రి సాజిద్ జావిద్ కేటాయిస్తారని, అవసరమైతే మరో 100 కోట్ల పౌండ్ల నిధులను అందుబాటులో ఉంచుతారని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఈ అదనపు నిధులను సరిహద్దుల వద్ద సన్నాహాలను వేగవంతం చేయటం, ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందించటం, నిష్క్రమణా నంతర కార్యకలాపాలకు సిద్ధం కావటం, అవసరమైన ఔషధాల సరఫరాను కొనసాగించటం వంటి అంశాలకు వినియోగిస్తారని ఈ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 31న ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రెగ్జిట్ ప్రక్రియను ముగిస్తామని కొత్త ప్రధాని బోరిస్ జాన్సన్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎటువంటి ఒప్పందమూ లేకుండా కూటమి నుంచి బ్రిటన్ నిష్క్రమిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పుతుందన్న హెచ్చరికలు వస్తున్నప్పటికీ ప్రధాని జాన్సన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించటం గమనార్హం. బ్రెగ్జిట్ సన్నాహాల కోసం బ్రిటన్ సర్కారు ఇప్పటి వరకూ 630 కోట్ల పౌండ్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో గత అక్టోబర్లో అప్పటి ఆర్థిక మంత్రి ఫిలిప్ హామండ్ 210 కోట్ల పౌండ్లను ప్రకటించగా, తాజాగా ప్రస్తుత బడ్జెట్లో మరో 420 కోట్ల పౌండ్లను ప్రకటించారు. బ్రెగ్జిట్కు మరో 92 రోజుల గడువున్న నేపథ్యంలో తాము సన్నద్ధత ప్రణాళికలను వేగవంతం చేస్తున్నామని ఆర్థిక మంత్రి జావిద్ వివరించారు. ఈ లోపుగా కూటమితో ఎటువంటి ఒప్పందమూ కుదరకపోతే తాము నోడీల్ బ్రెగ్జిట్ను అనుసరించాల్సి వుంటుందని, ఇప్పుడు అదనంగా కేటాయించిన 210 కోట్ల పౌండ్ల నిధులతో ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా తాము బయటకు వచ్చేందుకు సిద్ధంగా వున్నామని ఆయన చెప్పారు.