Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రియాద్: మహిళలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసినట్టు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై మగ సంరక్షకుల సాయంలేకుండా వయోజన మహిళలు సుదూర ప్రాంతాలకు ప్రయాణించవచ్చునని పేర్కొంది. పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు మంజూరు చేస్తామంటూ సౌదీ ప్రభుత్వం ' ఉమ్ అల్ ఖురా' అనే తమ గెజిట్లో పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికాలో సౌదీ తొలి మహిళా రాయబారి రీమా బందార్ అల్సౌద్ ధ్రువీకరించారు. సౌదీలో పౌర చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. ఇక మహిళల పట్ల ఉండే ఆంక్షల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లోవారి అనుమతి లేకుండా ఆడవాళ్లు కాలు బయటపెట్టడానికి వీలుండదు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే కుటుంబ సభ్యుడు తోడుగా వెళ్లాలి. అయితే, తాజాగా సౌదీ సంచలన నిర్ణయం తీసుకుంది. వయోజన మహిళలను ఎలాంటి అనుమతి లేకుండా ఒంటరిగానే ప్రయాణించడానికి అవకాశం కల్పించింది. అలాగే కుటుంబ విషయాలపై వారికి మరింత నియంత్రణను ఇచ్చింది. పిల్లల జననం, వివాహం లేదా విడాకులను నమోదు చేయడం, అధికారిక కుటుంబ పత్రాలు జారీ చేయడం, మైనర్లకు సంరక్షకుడిగా వ్యవహరించేందుకు తాజాగా సవరించిన నిబంధనలు సౌదీ మహిళలకు అవకాశం కల్పిస్తున్నాయి. సాంప్రదాయక ముస్లిం రాజ్యాన్ని మార్చి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఆలోచనతో సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఇటీవల బహుళ సామాజిక ఆంక్షలను ఎత్తివేశారు. దీనిలో భాగంగానే మహిళలకు డ్రైవింగ్ చేసే అవకాశం కల్పించారు. అలాగే గతేడాది పురుష సంరక్షక వ్యవస్థను తొలగించడానికి సైతం మహ్మద్ మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు మహిళలకు ఉపాధి నిబంధనలను కూడా కలిగి ఉన్నాయి. లింగం, వైకల్యం, వయసు ఆధారంగా ఎటువంటి వివక్షతను ఎదుర్కోకుండా పని చేసే హక్కు పౌరులందరికీ ఉందని పేర్కొంటున్నాయి. 2030 నాటికి ఆర్థిక వ్యవస్థను మార్చడానికి ప్రిన్స్ మహ్మద్ 2016లో ప్రతిష్టాత్మక ప్రణాళికను ఆవిష్కరించారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని 22 శాతం నుండి 30 శాతానికి పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం.