Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 100కి చేరిన మృతుల సంఖ్య
ఢాకా : బంగ్లాదేశ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. వరదల్లో చిక్కుకొని మృతి చెందిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 100కు చేరింది. వందలాది మంది ఆచూకీ గల్లంతైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలమట్టమయ్యాయి. వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. దీంతో, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఈదురుగాలుల కారణంగా వందలాది ఇండ్ల పైకప్పులు గాల్లో ఎగిరిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ క్రాస్ బృందాలు పర్యటించి సహాయక చర్యలు చేపడుతున్నాయి. 1.63 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో తీవ్ర పంట నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వ అధికారులు అంచనా వేశారు. బంగ్లాదేశ్లో పోటెత్తిన వరదల కారణంగా 7లక్షల మంది ఇబ్బందిపడుతున్నారని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.