Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిషేధిత ఇండిపెండెన్స్ పార్టీ చీఫ్, కార్యకర్తల అరెస్ట్
హాంగ్కాంగ్ : హాంగ్కాంగ్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నది. నేరారోపణలు ఎదుర్కొంటున్న పౌరులను పారదర్శక విచారణ నిమిత్తం చైనాకు తరలించాలని హాంగ్కాంగ్ ప్రభుత్వం ఓ బిల్లును ప్రతిపాదించింది. అయితే, ఈ బిల్లుపై హాంగ్కాంగ్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మెజారిటీ పౌరులు మాత్రం నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులను చైనాకు తరలించి విచారించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ వర్గానికి చెందిన ప్రజలు మాత్రం ఈ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హాంగ్కాంగ్ సీఈవో క్యారీ లామ్ తీరును నిరసిస్తూ గత రెండు నెలల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో క్యారీ లామ్ బిల్లు ప్రతిపాదనను తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే, ఆందోళనకారులు మాత్రం బిల్లును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈబిల్లుకు ఆమోదం లభించి చట్టంగా మారినట్టయితే హాంగ్కాంగ్ న్యాయవ్యవస్థ మసకబారే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. హాంగ్కాంగ్ న్యాయవ్యవస్థను పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రతా బలగాలకు, నిరసనకారులకు పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. నిషేధిత ఇండిపెండెన్స్ పార్టీ చీఫ్ ఆండీ ఛాన్నే నిరసన కార్యక్రమాలకు ఆజ్యం పోసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గురువారం రాత్రి ఇంటెలిజెన్స్ వర్గాలు ఆండీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. షాటిన్ జిల్లాలో ఆండీతో పాటు మరో నలుగురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కాగా, హాంగ్కాంగ్లో బలమైన జాతీయ పార్టీగా ఆవిర్భవించిన ఇండిపెండెన్స్ పార్టీపై ప్రభుత్వం గతేడాది నిషేధం విధించింది. ఈపార్టీ కారణంగా దేశ అంతర్గత భద్రతకు పెను విఘాతం వాటిల్లే ప్రమాదముందని ప్రభుత్వం అనుమానిస్తోంది. హాంగ్కాంగ్లో కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలకు ప్రభుత్వ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. శుక్రవారం నుంచి విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని వెల్లడించారు.