Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు : టియా మారియా గ్రామస్తులు
లిమా : మైనింగ్ ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డుకుంటామని అరెక్వియా ప్రావిన్స్లోని టియా మారియా గ్రామస్తులు నినదించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని అధ్యక్షుడు మార్టిన్ విజ్కారాకు వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోవడంలేదని విమర్శించారు. మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభమైనట్టయితే పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. సయనైడ్, నైట్రోజన్ వంటి విషవాయువులు గాల్లోకి విడుదలవుతాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యపై స్పందించి మైనింగ్ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు విరుద్ధంగా మైనింగ్ నిర్మాణ పనులను కొనసాగించినట్టయితే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిపార్ట్మెంటల్ ఫెడరేషన్ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ అరిక్వియా అనే కార్మిక సంఘం హెచ్చరించింది. ఈనెల 5నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని పేర్కొంది. ఉపాధ్యాయ సంఘాలు, నిర్మాణ, రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులంతా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది. కార్మిక సంఘాల నేతలు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అరెక్వియా ప్రావిన్స్లో బలగాలు మోహరించాయి.
తాంబో లోయ ప్రాంతం నుంచి 2కిలోమీటర్ల దూరంలో ఉన్న టియా మారియా గ్రామంలో సదరన్ కాపర్ కార్పొరేషన్ అనే మైనింగ్ సంస్థను నెలకొల్పాలని పెరూ ప్రభుత్వం నిర్ణయించింది. 2003లో నిర్మాణ పనులను ప్రారంభించింది. మైనింగ్ ప్రాజెక్టుతో పర్యావరణానికి విఘాతం ఏర్పడుతుందని, తక్షణమే దీని నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థానిక ప్రజలు అప్పట్లోనే డిమాండ్ చేశారు. టియా మారియాలో 24వేల మంది నివసిస్తున్నారు. జీవనోపాధి కోసం పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. మైనింగ్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టయితే 1300 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని ప్రజలు అభ్యర్థించారు. మైనింగ్ నిర్మాణ పనులను కొనసాగించినట్టయితే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
దీంతో, ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మైనింగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2011లో తాత్కాలికంగా నిలిపివేసింది. 2015లో నిర్మాణ పనులు పునరుద్ధరించింది. గతనెల15న మైనింగ్ నిర్మాణ పనులను నిలిపివేయాలని నిరసనకారులు మరోసారి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.