Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాస ఇటీవలి నివేదికను ఖండించిన ఇండియా
ఐరాస : ఇండియాలో సాయుధ బలగాలకు, వేర్పాటువాదులకు మధ్య బాలలు నలిగిపోతున్నారని కొద్ది రోజుల క్రితం ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదలచేసింది. అయితే ఈ నివేదికను తీవ్రంగా ఖండిస్తూ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది. నివేదిక ఉద్దేశపూర్వకంగా తయారుచేశారనీ, కాశ్మీర్, నక్సలైట్ అంశాల్ని రాజకీయం చేయడంలో భాగంగా అంశాలు ఉన్నాయనీ ఇండియా స్పందించింది. భద్రతా మండలి ఎజెండాలో లేని అంశమిదనీ, ఇండియాలో ఎక్కడా అంతర్యుద్ధం లేదనీ, ఇక్కడ జరిగే పరిణామాలతో అంతర్జాతీయ భద్రతకు సంబంధం లేదనీ ఐరాసలో ఇండియా కార్యదర్శి పులోమి త్రిపాఠి తెలిపారు.
'బాలలు, వేర్పాటువాదం' అనే అంశంపై గత మంగళవారం ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వార్షిక నివేదికను విడుదల చేశారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు, నక్సలైట్ గ్రూపులు బాలల్ని పెద్ద సంఖ్యలో రిక్రూట్చేసుకుంటున్నాయని ఇందులో గుటెర్రస్ తెలిపారు. కథువాలో 8ఏండ్ల బాలికపై జరిగిన అత్యంత పాశవిక లైంగికదాడి, హత్యను నివేదికలో ప్రస్తావించారు.''ఇండియాలో వేర్పాటువాద గ్రూపుల్లో బాలల రిక్రూట్మెంట్ పెరిగింది. సాయుధ బలగాలకు, వేర్పాటువాదులకు మధ్య పోరు నేపథ్యంలో బాలలు పెద్ద ఎత్తున నలిగిపోతున్నారు. జమ్మూకాశ్మీర్లో ఈ తరహా హింసాయుత ఘటనలు పెరిగాయి. కేంద్ర బలగాలకు, నక్సలైట్లకు మధ్య పోరు సాగుతోంది'' అని నివేదికలో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. నివేదికలోని అంశాలు తమను నిరాశకలిగించాయని ఇండియా తన అభ్యంతరం వ్యక్తం చేసింది.