Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురి మృతి : పలువురికి గాయాలు
జకర్తా : ఇండోనేషియాలోని సుమత్ర, జావా దీవుల్లో శుక్రవారం రాత్రి 6.8 తీవ్రతతో సముద్రగర్భంలో సంభవించిన శక్తివంతమైన భూకంప కారణంగా నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాల య్యాయి. సునామీ భయంతో తీర ప్రాంతంలో నివసిస్తున్న సుమారు వెయ్యి మందికి పైగా అక్కడ నుంచి తరలి వెళ్ళినట్టు ఇండోనేషియా విపత్తు సంస్థ అధికారులు శనివారం తెలిపారు. సుమత్రా దీవుల్లోని తెలుకు బెటంగ్ నగరానికి 141 మైళ్ళ దూరంలో (దాదాపు 227 కిలోమీటర్లు) హిందూ మహా సముద్రంలో భూ కంపం సంభవించినట్టు అమెరికా భౌగోళిక సర్వే సంస్థ తెలిపింది. జావాలోని బాంటెన్ ప్రావిన్స్లో భయాందోళనలకు గురైన 48ఏండ్ల మహిళ గుండెపోటు తో మృతి చెందారు. భూ కంపం కారణంగా 34 నివాసాలు ధ్వంసమయ్యాయి. దాదాపు డజనుకు పైగా నివాసాలు దెబ్బ తిన్నాయి. భూ కంపం సంభవించిన కొద్ది నిముషాల వ్యవధిలోనే ఇండోనేషియా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు రెండు గంటలపాటు హెచ్చరికలను కొనసాగించింది.
లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. లాంపంగ్ ప్రావిన్స్లోని ప్రభుత్వ కార్యాలయంలో తలదాచుకున్న వెయ్యి మందితో సహా పలువురు ప్రజలు తిరిగి వారి నివాసాలు చేరుకున్నట్టు విపత్తు నివారణా సంస్థ తెలిపింది.