Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఆర్జీసీ అదుపులో ఏడుగురు నావికులు
టెహ్రాన్ : చమురు అక్రమ రవాణాకు పాల్పడుతున్న విదేశీ నౌకను స్వాధీనం చేసుకున్నట్టు ఇరాన్ ఆదివారం వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించిన చమురు నౌకను స్వాధీనం చేసుకున్నట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తెలిపింది. నౌకలోని 7లక్షల లీటర్ల చమురును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఏడుగురు నావికులను అరెస్ట్ చేసినట్టు తెలిపింది. అయితే, స్వాధీనం చేసుకున్న నౌక ఏదేశానికి చెందింది, అరెస్టయిన నావికుల జాతీయత వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఐఆర్జీసీ కమాండర్ రమెజాన్ జిరాహీ తెలిపారు. కాగా, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చిన తర్వాత మిత్రదేశాలపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించొద్దని హెచ్చరిస్తోంది. ఇరాన్ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తోందని, ఉగ్రసంస్థలకు ఇరాన్ నుంచి విరాళాలు అందుతున్నాయని ఆరోపించింది. ఇరాన్ను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా కుట్ర పన్నింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దని మిత్రదేశాలను హెచ్చరించింది. ఈనేపథ్యంలో పలు ఐరోపా దేశాలు కూడా ఇరాన్ నుంచి ద్వైపాక్షిక సంబంధాలు తెగతెంపులు చేసుకున్నాయి. గిబ్రాల్టర్ ప్రాంతంలో ఇరాన్కు చెందిన చమురు రవాణా నౌకను బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. ఈయూ ఆంక్షలు ఉల్లంఘిస్తూ సిరియాకు అక్రమ మార్గంలో చమురు రవాణా చేసేందుకు ఇరాన్ ప్రయత్నించిందని ఆరోపించింది. బ్రిటన్ ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది. సిరియాకు తాము చమురు రవాణా చేయలేదని, బ్రిటన్ తమపై చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని పేర్కొంది.
ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత హౌర్మూజ్ జలసంధిలో బ్రిటన్కు చెందిన నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరాన్, ఒమన్ ప్రాంతాలకు మధ్యలో ఉన్న హౌర్మోజ్ జలసంధిలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఇరాన్ను దొంగదెబ్బ తీసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. హూర్మూజ్ జలసంధిలో బలగాలను మోహరించనున్నట్టు ప్రకటించింది.