Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో 29 మంది మృతి, 52 మందికి గాయాలు
వాషింగ్టన్ : అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో 29మంది మృతి చెందారు. 52 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరుస కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడంతో అమెరికన్లలో భయాందోళనలు నెలకొన్నాయి. దుండగులు కాల్పులకు పాల్పడ్డ కారణం తెలియరాలేదు. ఈ రెండు ఘటనలకు ఉగ్రవాదంతో ఏమైనా సంబంధాలున్నాయా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న ప్రత్యేక బలగాలు ఘటనాస్థలాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి. పరిసర ప్రాంతాల్లో ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నాయి. స్థానిక అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....టెక్సాస్లో ఎల్పాసో నగరంలోని వాల్మార్ట్ స్టోర్లో ఆదివారం తెల్లవారుజామున కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా, 26 మంది గాయపడ్డారు. కాల్పుల ఘటనకు సంబంధించి అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నట్టు ఎల్పాసో ఎస్పీ గ్రెగ్ అలెన్ తెలిపారు.
డేటొన్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి ఆర్గాన్ జిల్లా నీడ్ పెప్పర్స్ బార్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీనికి స్పందించిన పోలీసు అధికారులు ఎదుదాడి చేయడంతో ఆ కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. ఈ ఘటనలో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ ఘటన బార్ వెలుపలి ప్రదేశంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన లైవ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాల్పుల ఘటనలపై ఒహియో గవర్నర్ మైక్ డీవైన్, డేటోస్ మేయర్ నాన్వేలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.