Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా ఆగ్రహం
ప్యాంగ్యాంగ్ : కొరియా గగనతలంలో దక్షిణకొరియా, అమెరికా దేశాలు సంయుక్త సైనికులు విన్యాసాలు ప్రదర్శించారు. ఇరుదేశాల కవ్వింపుపై ఉత్తరకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి దుశ్చర్యలతో ఉత్తరకొరియా, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరించింది. తమ సామర్థ్యాలను పరీక్షించుకోవడంలో భాగంగానే సైనిక విన్యాసాలు ప్రదర్శించినట్టు దక్షిణకొరియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, దక్షిణకొరియా తన మిత్రదేశమైన అమెరికా సైన్యంతో ఈ విన్యాసాలు ప్రదర్శించడం పట్ల ఉత్తరకొరియా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇలాంటి కవ్వింపులను తిప్పిగొట్టేందుకే ఉత్తరకొరియా గతవారం స్వల్పశ్రేణి క్షిపణులను జపాన్ సముద్ర జలాల్లో ప్రయోగించింది. కొరియా గగనతలంలో దక్షిణకొరియా, అమెరికా దేశాలు తమ సైనిక విన్యాసాల ప్రదర్శనలను ఉపసంహరించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రయోగించింది. అయితే, ఉత్తరకొరియా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ దక్షిణకొరియా, అమెరికా దేశాలు సైనిక విన్యాసాలు ప్రదర్శించడం వివాదాస్పదమైంది. కొరియా ద్వీపకల్పంలో శాంతిస్థాపన కోసం ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాది సింగపూర్లో చరిత్రాత్మక భేటీ అయ్యారు. అణ్వస్త్ర నిరాయుధీకరణ అంశంపై సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రపంచ శాంతి దృష్ట్యా అణ్వస్త్ర పరీక్షలను నిలిపివేయాలని కిమ్ని ట్రంప్ కోరగా దీనికి సమ్మతించారు. ఉత్తరకొరియాపై మోపిన ఆంక్షలను రద్దు చేయాలని ట్రంప్ని కిమ్ కోరారు. ఈ భేటీ విజయవంతమైనట్టు ఇరువురు నేతలు ప్రకటించారు. ఈభేటీలో చర్చించిన అంశాలకు కట్టుబడిన ఉత్తరకొరియా తమ దేశంలోని అణ్వస్త్ర పరీక్షా కేంద్రాలను అంతర్జాతీయ మీడియా సాక్షిగా ధ్వంసం చేసింది. కాగా, ఉత్తరకొరియాపై ఆంక్షల రద్దుకు అమెరికా నిరాకరించడంతో ఈఏడాది ఫిబ్రవరిలో హనోరులో ఇరుదేశాధినేతలు మరోసారి భేటీ అయ్యారు. ఆంక్షల రద్దు అంశంపై ట్రంప్ నుంచి సానుకూల స్పందన కొరవడటంతో ఈ భేటీ కూడా విఫలమైనట్టు కిమ్ ప్రకటించారు. ఓపక్క ఉభయకొరియా దేశాల మైత్రి కోసం ప్రయత్నిస్తున్నట్టు కపటనాటకాలాడుతూ మరోపక్క దక్షిణకొరియాను రెచ్చగొట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. దక్షిణకొరియాకు క్షిపణి రక్షణవ్యవస్థను ఎగుమతి చేస్తున్నది. కొరియా గగనతలంలో విహరించే రాడార్ల సమాచారాన్ని పసిగట్టే పరిజ్ఞానాన్ని దక్షిణకొరియాకు అందించింది. కొరియా ద్వీపకల్పంలో దక్షిణకొరియాతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నది. తమ మిత్రదేశం సార్వభౌమత్వాన్ని ఏదేశమైనా దెబ్బతీసేందుకు ప్రయత్నించినట్టయితేనే దాడులకు పాల్పడతామంటూ పరోక్షంగా ఉత్తరకొరియాను హెచ్చరిస్తున్నది. ట్రంప్, కిమ్ భేటీ జరిగిన తర్వాత కూడా దక్షిణకొరియాలో మోహరించిన 28,500 మంది సైనికులు వెనక్కి వెళ్లిపోలేదంటేనే అమెరికా వైఖరి స్పష్టమవుతున్నది. ఉభయ కొరియా దేశాల మధ్య స్నేహభావం కోసం ప్రయత్నించినట్టయితే తమ బలగాలను ఉపసంహరిం చుకోవాలని ఉత్తరకొరియా అధినేత పలుమార్లు ట్రంప్ సర్కారును కోరారు.అయితే, కిమ్ అభ్యర్థనపై అమెరికా నుంచి ఎలాంటి స్పందన రాలేదు.