Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 మంది మృతి, 141 మందికి గాయాలు
- ఘటనకు మాదే బాధ్యత : తాలిబన్లు
కాబూల్: అప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 141 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు తాలిబన్లు ప్రకటించుకున్నారు. అఫ్ఘాన్ డిప్యూటీ అంతర్గత వ్యవహారాల మంత్రి జనరల్ ఖోషాల్ సదాత్ తెలిపిన వివరాల ప్రకారం...కాబూల్లోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మాహుతి దాడి జరిగింది. భారీ పేలుడుతో పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. పోలీస్ స్టేషన్కు సమీపంలో నిలిపివున్న వాహనాలు తునాతునకలయ్యాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 141 మంది గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో 15 మంది విషమంగా ఉన్నట్టు సమాచారం.పోలీసులను లక్ష్యంగా చేసుకొని తాలిబన్లు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చునని సదాత్ అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ప్రత్యేక బలగాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాయి. పరిసర ప్రాంతాల్లో ముమ్మర సోదాలు నిర్వహించాయి. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి. కాగా, తాలిబన్ ప్రతినిధులకు, అఫ్ఘాన్ అధికారులకు మధ్య దోహా నగరంలో శాంతి చర్చలు జరుగుతున్నాయి.ఓ పక్క చర్చలు జరుగుతుండగానే మరోపక్క తాలిబన్లు ఘాతుకానికి ఒడిగట్టడంతో అఫ్ఘాన్ పౌరులు బెంబేలెత్తుతున్నారు. శాంతిచర్చలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.