Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 మంది గల్లంతు, 10 లక్షల మంది తరలింపు
- ఆరెంజ్ హెచ్చరికలు జారీచేసిన వాతావరణ విభాగం
బీజింగ్ : తూర్పు చైనాలో తుఫాను దాటికి భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగపడటంతో 13మంది మృతిచెందినట్టు స్థానిక మీడియా పేర్కొంది. మరో 16 మంది గల్లంతయ్యారని, ముందు జాగ్రత్తగా పదిలక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని అధికారులు శనివారం తెలిపారు. వాతావరణ విభాగం ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 200 రైళ్లను, వేలాది విమాన సర్వీసులను సోమవారం వరకు రద్దు చేసినట్టు ప్రకటించింది. షాంఘైలో రెండో అతిపెద్ద విమానాశ్రయం కూడా సర్వీసులు నిలిపేసింది. తూర్పు ప్రాంతంలో జెజియాంగ్లో సంభవించిన తుఫాను 'లెకిమా' ప్రభావంతో గంటకు 187 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయని, తుఫాను ధాటికి కొండచరియలు విరిగి పడ్డాయని అధికారులు తెలిపారు. లెకిమా సూపర్ టైఫూన్ నుంచి క్రమంగా బలహీనపడినట్టు వాతావరణశాఖ వెల్లడించింది. మార్కెట్లను, వ్యాపార కార్యకలాపాలను నిలిపేశారు. తీరప్రాంత నగరమైన వెనెజౌకు ఉత్తరాన 130 కిలోమీర్ల దూరంలో కొండచరియలు విరిగిపడటంతో పాటు మూడు గంటల్లో 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, సహజ ఆనకట్ట కూలిపోయిందని అధికారులు తెలిపారు. తుఫాను ఉత్తరం వైపు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ క్రమంగా బలహీనపడుతున్నట్టు చైనా వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. బలమైన గాలులు, వర్షాలకు షాంఘైలో డిస్నీల్యాండ్ను మూసివేసినట్లు ప్రభుత్వం తెలిపింది.