Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్: అఫ్ఘన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య జరుగుతున్న చర్చల్లో విదేశీ జోక్యాన్ని తాము అంగీకరించబోమని అఫ్ఘన్ అధ్యక్షులు అష్రఫ్ ఘనీ స్పష్టం చేశారు. అఫ్ఘన్ ప్రభుత్వ ప్రమేయం లేకుండా తాలిబన్లతో శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఘనీ ఈ ప్రకటన చేశారు. ఆదివారం నాడు ఈద్ ప్రార్థనల అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడు రానున్న కాలంలో దేశ భవిష్యత్తును నిర్ణయించాల్సి వున్నందున వచ్చే నెలలో జరిగే అధ్యక్ష ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకు న్నాయన్నారు. ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తును ఇక్కడ తామే నిర్ణయించుకుంటామని, ఇందులో ఎవరి జోక్యాన్ని తాము కోరుకోవటం లేదని ఆయన తేల్చిచెప్పారు. దేశంలో శాంతియుత వాతావరణం నెలకొనాలన్నది ప్రతి అఫ్ఘన్ పౌరుడి ప్రగాఢ వాంఛ, ఇందులో ఎటువంటి సందేహానికీ తావులేదన్నారు. అయితే అఫ్ఘన్్లు ఆత్మగౌరవంతో సంచరించే విధంగా తాము శాంతిని కోరుకుంటున్నామని, కొంత మంది ప్రజలు దేశాన్ని వదిలిపెట్టాలన్న షరతుతో తాము శాంతి ఒప్పందాన్ని కోరుకోవటం లేదని, తాము మేధోవలసలను, పెట్టుబడి వలసలను కోరుకోవటం లేదని చెప్పారు.
సెప్టెంబర్ 1 నాటికి శాంతి ఒప్పందం : అమెరికా
తాలిబన్లతో సెప్టెంబర్ 1 నాటికి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు అమెరికా రాయబారి జాల్మే ఖలీల్జాద్ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ ఇతర ఉగ్రవాద శిబిరాలకు నెలవు కాబోదన్న హామీని తాలిబన్లు ఇస్తే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్న 20 వేల మంది అమెరికా, నాటో దళాలను తాము ఉపసంహరించుకుంటామని ఆయన చెప్పారు.