Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 మంది మృతి, 260 మందికి పైగా గాయాలు
దుబాయ్ : యెమెన్లోని ఆడెన్ నగరంలో ప్రభుత్వ అనుకూల దళాలకు, వేర్పాటు వాదులకు మధ్య కొనసాగుతున్న భీకర పోరులో ఇప్పటి వరకు 40 మందికి పైగా చనిపోయారు. మరో 260 మంది గాయపడ్డారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఆడెన్ నగరంలో కొనసాగుతున్న పోరులో అనేక మంది పౌరులు ప్రాణాలుకోల్పోగా, పలువురు ప్రజలు గాయాల పాలయ్యారని ఆదివారం ఒక ప్రకటనలో ఐక్యరాజ్యసమితి వివరించింది. శాంతి, సామరస్యాలు వెల్లివిరిసే ఈద్ ఉల్ అధా పండుగ రోజు ఆత్మీయుల మరణానికి విచారాన్ని తెలియచేయాల్సి రావటం అత్యంత విచారకరమైన అంశమని యెమెన్లోని ఐరాస కార్యక్రమాల సమన్వయ కర్త లిసె గ్రాండె ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అవసరమైన సహాయం అందించేందుకు వైద్య బృందాలను పంపటం తమ తక్షణ ప్రాధాన్యత అని ఆమె వివరించారు.
పలువురు ప్రజలు తమ ఇళ్లలోనే చిక్కుకుపోయి ఆహారం, నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు వెలువడుతున్న వార్తలు తమను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయని చెప్పారు. ప్రజలను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె అన్ని వర్గాలనూ కోరారు.