Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనిబోటా సర్కారుకు కమ్యూనిస్టు పార్టీ లేఖ
విన్నిపెగ్: ద్రవ్యలోటును తగ్గించే సాకుతో ప్రజల సేవలను, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను అటకెక్కిస్తున్న టోరీ తరహా 'పొదుపు' చర్యలను ప్రజలు తట్టుకోలేరని కెనడాలోని మనిబోటా ప్రావిన్షియల్ ప్రభుత్వానికి ఆ ప్రావిన్స్ కమ్యూనిస్టు పార్టీ ఒక లేఖలో వివరించింది. ఆస్పత్రులకు, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలకు ప్రతిపాదిస్తున్న కోతలు, ద్రవ్యలోటు దిద్దుబాటుకు కాదని, ప్రైవేటీకరణ లక్ష్యంగా సాగుతున్నాయని కమ్యూనిస్టు పార్టీ విమర్శించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలతో ఆస్పత్రులు, ఆరోగ్య పరిరక్షణా సేవలు తలకు మించిన భారం కావటంతో మనిబోటా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని వివరించింది. ధనికులు అమెరికాకు చెందిన వైద్యులతో ఆన్లైన్ ద్వారా వైద్య సేవలందుకుంటుండగా, కార్మిక, ఉద్యోగవర్గాలు మాత్రం ఈ కోతలతో ఆరోగ్య పరిరక్షణ అందుబాటులోకి రాక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. ఆరోగ్య పరిరక్షణా కార్యక్రమాలను పూర్తిగా బీమా కంపెనీల చేతుల్లో పెట్టటానికి టోరీ ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు ప్రారంభిం చాయని, ప్రభుత్వ రహస్య పత్రాలు ఈ అంశాన్ని రట్టు చేశాయని తెలిపింది. విద్యారంగానికి సైతం భారీ కోతలు తప్పటంలేదని, ఫలితం గా విద్యాసంస్థల మూసివేతలు, ఉద్యోగుల ఉద్వాసనలు, తరగతుల రద్దు వంటి వాటితో విద్యార్థులకు విద్య అందని మానిపండులా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. సంస్కరణల పేరుతో కెనడాలో ఉన్న ఒకే ఒక ఫ్రెంచ్ భాషా విశ్వవిద్యాలయాన్ని మూసివేశారని తెలిపింది. ద్రవ్యలోటును తగ్గించే సాకుతో ప్రభుత్వం చేపడుతున్న 'పొదుపు'చర్యలు సామాజికంగా తీవ్ర అశాంతికి, నిరుద్యోగిత పెరుగుదలకు దారి తీస్తున్నాయని, అరకొర వేతనాలతో చిరుద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో మనిబోటా ప్రజల అజెండా కోసం కమ్యూనిస్టు పార్టీ, దాని శ్రేణులు పోరాడేందుకు సిద్ధమవుతున్నాయని, ఇందుకోసం విస్తృత స్థాయి ప్రజా మద్దతు కూడగట్టేందుకు ప్రచార కార్యక్రమాన్ని చేపడతామని తెలిపింది.