Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురి మృతి, 15 మందికి గాయాలు
ఇస్లామాబాద్ :పాకిస్థాన్లోని క్వెట్టా నగరం పేలుడుతో దద్దరిల్లింది. ఓ మసీదులో భారీ పేలుడు సంభవించడంతో ఐదుగురు పౌరులు మృతిచెందగా, మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్యులు తెలిపారు. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. మసీదుకు సమీపంలో నివసిస్తున్న ప్రజలంతా ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. పేలుడు సంభవించిన ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. క్వెట్టా పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...కులీ కాసిమ్ ప్రాంతంలోని మసీదులో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 15 మంది మృతి చెందారు. మసీదులో శుక్రవారం నమాజు ముగిసిన అనంతరం పేలుడు సంభవించడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ప్రత్యేక బలగాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. పేలుడు కారణంగా మసీదు ధ్వంసమైంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకొని డాగ్స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్నది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. గతంలో జరిగిన పేలుళ్లకు తామే బాధ్యత వహిస్తున్నట్టు ఐఎస్, తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ ఘాతుకానికి ఐఎస్ సభ్యులే ఒడిగట్టి ఉంటారని పోలీస్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.