Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్-పాక్లకు అమెరికా సూచన
వాషింగ్టన్: దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, మానవ హక్కుల పరిరక్షణకు అవసరమైన రీతిలో వ్యవహరించాలని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి షీలా జాక్సన్ లీ భారత్-పాక్లకు సూచించారు. భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన అంశంపై ఐరాస భద్రతా మండలి శుక్రవారం నాడు రహస్య సమావేశంలో చర్చిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ అంశంపై తక్షణ చర్చకు మండలిని సమావేశ పర్చాలంటూ పాక్ ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో ఈ రహస్య భేటీ ఏర్పాటయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కాంగ్రెషనల్ కాకస్లో సహాధ్యక్షురాలు, భారత కాకస్లో సభ్యురాలిగా వున్న జాక్సన్ లీ గురువారం పోస్ట్ చేసిన ట్వీట్లలో ఈ సూచనలు చేశారు. శుక్రవారం నాటి మండలి భేటీ నేపథ్యంలో శాంతి, మానవ హక్కుల పరిరక్షణకు భారత్, పాక్లకు అవకాశం లభించిందని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించి మానవ హక్కులను కాపాడేందుకు లభించిన ఈ అవకాశాన్ని ఈ ప్రాంతంలో అణ్వస్త్ర సంపద వున్న ఈ రెండు దేశాలు సద్వినియోగం చేసుకోవాలని తాను విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆమె తెలిపారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు వ్యవహారం తమ అంతర్గత విషయమని అంతర్జాతీయ సమాజానికి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన భారత ప్రభుత్వం ఇందుకు సంబంధించిన 'వాస్తవాలను గుర్తించాల'ని పాక్కు సూచిస్తోంది. కాశ్మీర్ పరిస్థితిని ప్రభావితం చేసే చర్యలు తీసుకునే విషయంలో గరిష్ట స్థాయి సంయమనం పాటించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ భారత్-పాక్లకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో మూడో దేశం జోక్యాన్ని సిమ్లా ఒప్పందం తిరస్కరిస్తోందని ఆయన గుర్తు చేశారు.