Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : తాలిబన్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నారు. అఫ్ఘన్ సమస్యపై శుక్రవారం సీనియర్ సలహాదారులతో సమావేశమైన తరువాత ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆయన ట్వీట్ చేస్తూ ''అఫ్ఘన్పై సమావేశం ఇప్పడే ముగిసింది. పందొమ్మిది ఏండ్ల యుద్ధంలో ప్రత్యర్ధులుగా ఉన్నవారితో 'సాధ్యపడితే' ఒక ఒప్పందం కోసం మేము చూస్తున్నాం'' అని పేర్కొన్నారు. ట్రంప్ తన క్యాబినెట్ అధికారులు, జాతీయ భద్రత సీనియర్ సలహాదారులతో కలిసి న్యూజెర్సీ గోల్ఫ్ రిసార్ట్లో శుక్రవారం సమావేశమయ్యారని అమెరికా మీడియా పేర్కొంది. అఫ్ఘనిస్థాన్లో శాంతికోసం ప్రత్యేకంగా నియమింపబడిన అమెరికా దౌత్యాధికారి జల్మే ఖలీల్జాద్ అభిప్రాయాలు తెలుసుకొనేందుకు ఈ సమావేశం జరిగిందని వైట్హౌస్ ఒక ప్రకటనను విడుదల చేసింది. అమెరికా వైస్ప్రెసిడెంట్ మైక్ పెన్స్, విదేశాంగ మంత్రి పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ చైర్మెన్ జోసఫ్ డన్ఫోర్డ్, దేశ భద్రతా సలహాదారు జాన్ బాల్టన్ తదితరులు సమావేశానికి హాజరైనట్టు ఆ ప్రకటన పేర్కొంది. ''తాలిబన్, అఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంతో శాంతి, సయోధ్య ఒప్పందంపై సమావేశంలో చర్చ జరిగింది'' అని ఆ ప్రకటన తెలిపింది. అఫ్ఘనిస్తాన్ నుండి అమెరికాబలగాలు వెళ్ళిన వెంటనే ఒప్పందంపై ప్రకటన వెలువడే అవకాశమున్నదని అమెరికా, తాలిబన్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్, అఫ్ఘన్ ప్రభుత్వానికి మధ్య నేరుగా చర్చలు ప్రారంభించాలని యోచిస్తున్నట్టు మీడియా వెల్లడించింది.