Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా : టర్కీని ఒక బహిరంగ కారాగారంగా దేశంలోని పలువురు అభివర్ణించారు. అధ్యక్షుడు రిసిప్ తయాప్ ఎర్డగావ్ పాలనలో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం హరించుకు పోయిన నేపథ్యంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని ఇతర దేశాలలో జైలులో ఉన్న జర్నలిస్టులకన్నా, ఇక్కడ అత్యధిక మంది జర్నలిస్టులు జైలులో ఉన్నారు. 2016లో విఫలమైన కుట్ర నేపథ్యంలో వందలాది మీడియా సంస్ధలు మూతపడ్డాయి. ఈ కుట్రను దేవుడి బహుమతిగా ఎర్డగావ్ అభివర్ణించారు. రాజకీయ ప్రత్యర్ధులు, విమర్శకులపై అణిచివేతను మరింత తీవ్రతరం చేయడానికి ఇది ఆయనకు ఒక సాకుగా మారింది. దాదాపు 1,70, 000 మందికి పైగా ప్రభుత్వ రంగానికి చెందిన కార్మికులపై ఉగ్రవాదులుగా ముద్ర వేసి ఒక డిక్రీతో ఎర్డగావ్ వారిని తొలగించాడు. దాదాపు 8 వేల మంది విద్యావేత్తలను వారి పదవుల నుండి తొలగించడాన్ని సమర్ధించుకునేందుకు ఎర్డగావ్ ఉగ్రవాదులనే ముద్రనే ఉపయోగించుకున్నాడు. పీపుల్స్ డెమక్రటిక్ పార్టీ (హెచ్డీపీ), లేబర్స్ సిస్టర్ పార్టీకి చెందిన ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులపై 2016 నవరబరులో అర్ధరాత్రి సమయంలో దాడులు జరిపి జైలులో ఉంచాడు. పార్టీ మాజీ నాయకులు ఫిజెన్ యుక్సెకడాగ్, సెలాహట్టిన్ డెమిర్టస్ తదితరులు ఉగ్రవాద అభియోగాలపై జైలులోనే ఉన్నారు.