Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా అభ్యర్థనను తిరస్కరించిన గిబ్రాల్టర్
గిబ్రాల్టర్ : ఇరాన్ చమురు నౌకను స్వాధీనం చేసుకోవాలని అమెరికా చేసిన అభ్యర్థనను గిబ్రాల్టర్ తిరస్కరించింది. ఈయూ, ఇరాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తామని పునరుద్ఘాటించింది. అమెరికా కోర్టు ఆదేశాలను శిరసావహిస్తూ ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశం గిబ్రాల్టర్కు లేదని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దంటూ మిత్రదేశాలపై అమెరికా ఒత్తిడి పెంచింది. ఇరాన్పై భారీ ఆంక్షలు మోపింది. గల్ఫ్ సముద్ర జలాల ద్వారా ఇరాన్ చమురు అక్రమ రవాణాకు పాల్పడుతోందని ఆరోపించింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దంటూ ఈయూ సభ్య దేశాలపై కూడా ఒత్తిడి పెంచింది. అయితే, పలు దేశాలు మాత్రం ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తామని నిర్ణయించుకున్నాయి. గతనెలలో గిబ్రాల్టర్ ప్రాంతంలో ఇరాన్కు చెందిన చమురు నౌకను బ్రిటన్ నావికాదళం స్వాధీనం చేసుకుంది. ఇరాన్ నౌకలోని చమురు అంతర్యుద్ధం కొనసాగుతున్న సిరియాకు రవాణా అవుతోందని అమెరికా ఆరోపించింది. ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకోవాలని బ్రిటన్పై ఒత్తిడి పెంచింది. అయితే, ఇరాన్ నుంచి చమురు రవాణా చేస్తున్న నౌక సిరియాకు బయల్దేరిందనేందుకు బ్రిటన్ వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో, ఇక్కడి న్యాయస్థానం ఇరాన్ నౌకను బేషరతుగా విడుదల చేయాలని ఆదేశించింది. ఇరాన్ నౌక ఈయూ ఆంక్షలను ఉల్లంఘించిందనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని న్యాయస్థానం పేర్కొంది. అయితే, ఇరాన్ నౌకకు ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్ కార్ప్స్తో సంబంధాలున్నాయని, ఈ నౌకను తిరిగి స్వాధీనం చేసుకోవాలని గతవారం యూఎస్ న్యాయస్థానం గిబ్రాల్టర్ను ఆదేశించింది. అయితే, యూఎస్ కోర్టు ఆదేశాలను తాము బేఖాతరు చేస్తున్నామని గిబ్రాల్టర్ సర్కారు పేర్కొంది. ఇరాన్ ఈయూ ఆంక్షలను ఉల్లంఘించలేదని పేర్కొంది. దాదాపు 43 రోజుల నుంచి తమ ఆధీనంలో ఉన్న నౌకను విడుదల చేయాలని గిబ్రాల్టర్ సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించిందని తెలిపింది. గిబ్రాల్టర్ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇరాన్ నౌకను విడుదల చేశామని పేర్కొంది