Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖార్తౌమ్ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొం టున్న సుడాన్ మాజీ అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్ విచారణ నిమిత్తం ఖార్తౌమ్ కోర్టుకు సోమవారం హాజరయ్యారు. ఆయనపై అక్రమ విదేశీ మారక ద్రవ్యం, అవినీతి, విదేశీయుల నుంచి బహుమా నాలను స్వీకరించిన ఆరోపణలు వెల్లువెత్తాయి. సౌదీ రాజవంశీయుల నుంచి 90 మిలియన్ డాలర్లు స్వీకరించినట్టు ప్రాథమిక విచారణలో ఒమర్ అంగీకరించినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఒమర్ నివాసంలో సోదాలు నిర్వహించినప్పుడు 7.8 మిలియన్ డాలర్ల అక్రమ సంపాదనను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు కేసు విచారణ చేపట్టిన పోలీసు అధికారులు కోర్టుకు నివేదించారని అన్నారు. సౌదీ యువరాజు సల్మాన్ నుంచి 25 మిలియన్ డాలర్లు పొందినట్టు ఆధారాలను సేకరించామని అన్నారు. కింగ్ అబ్దుల్లా నుంచి 65 మిలియన్ డాలర్లు స్వీకరించినట్టు కోర్టులో ప్రాసిక్యూషన్ విభాగం ఆధారాలను సమర్పించిందని అన్నారు. కాగా, ఒమర్ అల్ బషీర్ 1989, జూన్30న సుడాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 30 ఏండ్ల పాటు సుడాన్ను పాలించారు. ఒమర్ నియంతృత్వ విధానాలపై విరక్తి పొందిన సుడానీలు ఆయన పాలనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన పాలనలో అవినీతి పేరుకుపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో సుడాన్ పౌరులు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ఒమర్ను విమర్శిస్తూ నినాదాలు చేశారు. ఒమర్ను గద్దె దించాలని డిమాండ్ చేశారు. అనేక ప్రాంతాల్లో హింసాత్మక అల్లర్లు చోటు చేసుకున్నాయి. పాలన స్తంభించింది. దీంతో, రంగంలోకి దిగిన ఆర్మీ ఒమర్ను నిర్బంధించి 30ఏండ్ల నియంతృత్వ పాలనకు చరమగీతం పాడింది.