Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 మంది ప్రయాణీకుల బందీ
- పోలీసుల కాల్పుల్లో కిడ్నాపర్ హతం
రియోడీ జనేరియో : బ్రెజిల్లో ఓ దుండగుడు బస్సును హైజాక్ చేశాడు. బస్సులో ప్రయాణిస్తున్న 18 మందిని బందీలుగా మార్చుకున్నాడు. కిడ్నాపర్ తుపాకీ, గ్యాసోలిన్లను తనతో తెచ్చుకున్నట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ప్రయాణీకులను తుపాకీతో కాల్చి చంపేస్తానంటూ బెదిరించాడని అన్నారు. సమాచారం అందుకున్న ప్రత్యేక బలగాలు, పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబు నిర్వీర్యం చేసే బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. కిడ్నాపర్ చెర నుంచి ప్రయాణీకులను విడిపించేందుకు ప్రయత్నించాయి. కిడ్నాపర్ తన డిమాండ్లను వెల్లడించినట్టయితే పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే, కిడ్నాపర్ కొన్ని గంటల పాటు ప్రయాణీకులకు చుక్కులు చూపించాడు. తొలుత ఆరుగురు ప్రయాణీకులను విడుదల చేశాడు. మిగతావారిని వదిలిపెట్టేందుకు ససేమిరా నిరాకరించాడు. అంతేగాకుండా, పోలీసులపై కాల్పులు జరిపాడు. ప్రయాణీకులను విడుదల చేసి లొంగిపోవాలని పోలీసులు, బలగాలు హెచ్చరించినా కిడ్నాపర్ పెడచెవిన పెట్టాడు. చివరికి పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో కిడ్నాపర్ హతమైనట్టు చైనా మీడియా సంస్థ 'షిన్హువా' ప్రకటించింది. ఈ ఘటన జరిగిన రియో-నిటోరియా బ్రిడ్జీపై పలు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిందని, కిడ్నాపర్ దాడిలో గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. అయితే, ఎదురుకాల్పుల్లో మృతిచెందిన నిందితుడి వివరాలను వెల్లడించేందుకు రియో పోలీస్ అధికారులు నిరాకరించారు.